ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం
ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

 ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఆదివారం మంత్రి దుదిల్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌లో టీ – ఫైబర్‌ యాప్‌ ను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ తో కలిసి ముత్తారం మండలం అడవి శ్రీరాం పూర్‌ గ్రామ పంచాయతీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు సమీక్షంలో ఐటీ, పరిశ్రమల శాఖ తెలంంగాణలో 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆజాద్‌ ఇంజనీరింగ్‌, ప్రీమియర్‌ ఎనర్జీస్‌, గ్లోబల్‌ ఎన్విరాన్మెంట్‌, లెన్స్‌ కార్ట్‌ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు అందించే టి-ఫైబర్‌ యాప్‌ ద్వారా టెలిఫోన్‌, ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ, కంప్యూటర్‌ వంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటిని అందరూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా 3 పైలెట్‌ గ్రామాలను ఎంపిక చేసి టీ ఫైబర్‌ యాప్‌, ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్స్‌ అందించామని, ఇందులో నుంచి వొచ్చే అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు విస్తరిస్తామని  అన్నారు. టీ ఫైబర్‌ ప్రాజెక్టు ద్వారా మొదటి సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్‌ బ్యాండ్‌  కనెక్షన్‌ అందిస్తామని అన్నారు.
మీ సేవా  ద్వారా 150 రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువచేసేందుకు  ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో క్యూఎస్కే లను ఏర్పాటు చేయనుందని అన్నారు.  షాపింగ్‌ మాల్స్‌ మెట్రో స్టేషన్లు సమీకృత కలెక్టరేట్లు, ఇతర  ప్రాంతాలు ఇంటరాక్టివ్‌ క్యూఎస్కే ద్వారా ప్రజల పౌర సేవలు పొందవచ్చని, దరఖాస్తు నింపడం చెల్లింపులు చేయడం సర్టిఫికెట్‌ ప్రింట్‌ తీసుకునే అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మీ సేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చిందని, పర్యాటక శాఖ హోటల్స్‌, పర్యాటక ప్యాకేజీల బుకింగ్‌, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వయో వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ సర్టిఫికెట్ల జారీ,  అటవీ శాఖకు సంబంధించి వన్యప్రాణుల బాధితులకు సహాయం కొత్తవి జారీ, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులు వంటి సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. పైలెట్‌ ప్రాజెక్టు కింద ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్‌ గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌,టెలిఫోన్‌ కనెక్షన్‌ అందించినందుకు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపిఓ వీర బుచ్చయ్య, జడ్పీ సీఈఓ నరేందర్‌,మంథని ఆర్డీవో సురేష్‌,సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టి ఫైబర్‌ పైలెట్‌ ప్రాజెక్టులో అడవి శ్రీరాంపూర్‌ గ్రామాన్ని ఎంపిక చేయడం సంతోషకరమని జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, దొడ్డ బాలాజీ అన్నారు. అడవి శ్రీరాంపూర్‌ గ్రామాన్ని ఇలాగే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని వారు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page