రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందజేశారు.  వివిధ కార్పొరేషన్‌లు ఎస్పివిల రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని,  ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావలసిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ ‌పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌నుంచి తెలంగాణ పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశంపై చర్చించారు.  ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కింద నిధుల బదిలీ కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌మరియు తెలంగాణ పవర్‌ ‌యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్‌ ‌కమిషనర్‌ ‌గౌరవ్‌ ఉప్పల్‌, ఎం‌పీలు మల్లు రవి,చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, బలరాం నాయక్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page