వన్ ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిద్దుకుందాం..

  • విద్యాస‌గ‌ర్‌రావు అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు.
  • ముఖ్యమంత్రి ర‌వేంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రం స‌మష్టిగా కృషిచేసి తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా ను తీర్చిదిద్దుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం తాజ్‌క్రిష్ణ‌లో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (Chennamaneni Vidya Sagar) రచించిన ఉనిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కె.హరిబాబు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, పుస్తక రచయిత చెన్నమనేని విద్యాసాగర్ రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌ 35 ఏళ్ల జీవితంలో ఆదర్శంగా తీసుకున్న వారందరిని ఒకే వేదిక మీద కలిసే అవకాశం వొచ్చింద‌ని అన్నారు. విద్యాసాగర్ రావును అభిమానించేవారంతా సాగర్‌జీ గా పిలుస్తారని, ఆయ‌న మాకు సాగర్ జీనే అని అన్నారు. రెండు రాష్ట్రాల్లో సమర్థవంతంగా గవర్నర్ గా విధులు నిర్వర్తించి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టార‌ని కొనియాడారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం గడిపిన విద్యాసాగర్ రావు ఒక్క ఆరోపణ ఎదుర్కోక‌పోవ‌డం అభినందనీయమ‌న్నారు.

తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడే రాజకీయ వేత్త గా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాల్లో జార్జి రెడ్డి, విద్యాసాగర్ రావు నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారు.. ప్రస్తుతం యూనివర్సిటీలు ఉనికి కోల్పోయేలా ఉన్నాయి. యూనివర్సిటీల్లో విద్యార్థులు రాజకీయాల్లో ఉండటం అవసరం. ముఖ్యమంత్రి కాగానే యూనివర్సిటీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కీల‌క నిర్ణయాలు తీసుకున్నాన‌ని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే విద్యార్థులు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లనే సాధ్య‌మైంది. రాజకీయాల్లో సిద్దాంతపరమైన భావజాలం లేకపోవడం వల్లనే ఈనాడు పార్టీ ఫిరాయింపులు చోటుచేసుకుటున్నాయి. ఏదో ఒక పదవి కోసం పార్టీలు మారుతున్నారు. విద్యార్థి దశలో సిద్దాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీకి కట్టుబడి ఉంటారు. సిద్దాంతపరమైన విద్యార్థి రాజకీయాలను రాష్ట్రంలో పునరుద్దించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో రాణించాలని భావించే వారు ఉనిక పుస్తకాన్ని చదవాలి. మూడో తరంలో చెప్పుకోదగిన నాయకులు లేకుండాపోయారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేలు చూపిస్తే స్పీకర్ మైక్ ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ప్రతిపక్షం, పాలక పక్షం. 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపించడం ప్రతిపక్షం పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాల క్రమేణా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోతున్నామ‌ని, పాలక పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య సభలో ప్రతిష్టంభన వొచ్చినప్పుడు కమ్యూనిస్టులు, బీజేపీ పార్టీ లు సలహాలు, సూచనలు ఇచ్చేవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి ని చూపిస్తోంది. 13 నెలల్లో ఇప్పటి వరకు అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యులను మా ప్రభుత్వం బహిష్కరించలేదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్ జీ పాదయాత్ర చేశారు.. గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత , చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొచ్చారు.. గోదావరి జలాల వినియోగంపై సాగర్‌జీ సలహాలు, సూచనలు ఎంతో అవసరం. మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించిన ఆ ముఖ్యమంత్రితో మాట్లాడమని గతంలో నేను సాగర్ జీ కోరారు.

గోదావరి జలాల వినియోగంలో సాగర్ జీ అనుభవం చాలా అవసరం. తుమ్మడి హెట్టి దగ్గర భూసేకరణ కోసం సాగర్‌జీ సహకారం తీసుకుంటాం. నాకు భేషజాలు లేవు. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా.. సహకారం తీసుకుంటా.. తెలంగాణను వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గా తయారు చేయడం కోసం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను.. తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వొస్తుంది.. విశ్వనగరంగా హైదరాబాద్ మారాలంటే రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ కావాలని ప్రధాని మోదీని కోరారు. తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి డ్రైపోర్టు ఇవ్వాలని అడిగాను. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ప్రధాని మోదీ సహకారం కోరాను..

అమరావతితో మనకు పోటీ లేదు.. ప్రపంచంతో మనం పోటీ పడదాం. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడదాం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడాలంటే మెట్రో రైల్‌కు అనుమతులు తెచ్చుకోవాలి. తమిళనాడు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పటికి అక్కడ మెట్రోకి ప్రధాని మోదీ సహకరించారు.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రధాని మోదీ బెంగళూరుకి మెట్రో ఇచ్చారు. తెలంగాణ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేత వినోద్‌రావు లాంటి నాయకులు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కలిసి కట్టుగా తెలంగాణ కోసం పని చేయాలి.. తమిళనాడులో వారి భాష కోసం, జల్లికట్టు కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి పోరాడారు.. 39 మంది తమిళనాడు ఎంపీలు లోక్ సభలో తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రోకు అనుమతి ఇస్తే బాగుంటుంద‌న్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం 75 ఐటీఐల ను ఐటీసీలు మారుస్తున్నాం. రూ.2100 కోట్లతో టాటా సంస్థ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా నియమించాం. యూనివర్సిటీ కోసం 600 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నాం. జూన్ 2 లోపల మేఘా సంస్థ నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనం పూర్త‌వుతుంది.. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలిపిక్స్ లో పతకాలు తేలేకపోయిది. ఆర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2028 లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో బంగారు పతకాలు తెచ్చేలా లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాం. ప్రధాని మోదీ నుంచి అనుమతులు ఇప్పించగలిగే నాయకులు ఈ వేదికపై ఉన్నారు. ప్రధానిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకుందాం. వన్ ట్రిలియన్ ఎకానమి గా తెలంగాణ ను తీర్చిదిద్దుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page