సొంత మీడియాకు ప్రజాధనం ధారాదత్తం
ఏప్రిల్ లో భూ భారతి చట్టం అమలు
రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ప్రకటనల పేరిట కొల్లగొట్టిందని, సొంత పత్రికలు, మీడియాకు ధారాదత్తం చేసిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన శాసనసభలో సమాచార పౌరసంబంధాల శాఖ పద్దులపై మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ప్రకటనల కోసం ఖర్చులలో బీఆర్ఎస్ సొంత మీడియా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ లకు ఎంత ఖర్చు పెట్టారన్న దానిపై సమాచార శాఖ మంత్రిగా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
గత ప్రభుత్వ పదేళ్ల హయాంలో రూ.564.40 కోట్లను తెలంగాణేతర రాష్ట్రాలలో ఖర్చు చేసి పేదల సొమ్మును సొంత ప్రచారానికి వాడుకుందని ఆయన తెలిపారు. అంతేగాక వేలాది కోట్లు ఖర్చుచేసి సొంత మీడియాకు పంచి పెట్టిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 16నెలల వ్యవధిలో సుమారు 200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనల పేరిట చేసిన ప్రజాధనం దుర్వినియోగాన్ని మంత్రి సోదాహరణంగా వివరించారు. 2014లో ప్రారంభమైన నమస్తే తెలంగాణ పత్రికకు కాలం సెంటీమీటర్కు రూ.875 గా ఉండేదని, తర్వాత 2016లో అది రూ. 1150కు చేరిందని, 2019లో రూ.1500కు పెంచేశారని తెలిపారు. ఇదే సమయంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు పత్రిక టారిఫ్ రూ. 1500 గా ఉందని, దీనిని బట్టి ప్రజాధనం ఏవిధంగా గత ప్రభుత్వం సొంతపత్రికకు ఇచ్చిందో అర్ధమవుతుందన్నారు. ఈనాడుకు నమస్తే తెలంగాణకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి అన్నారు.
ఇక తెలంగాణ టుడే అనే సొంత ఆంగ్ల పత్రికకు 2017లో కాలం సెంటీమీటర్ రూ.1000 ఉండగా, కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2019లో ఈ రేటును రూ.2000 రూపాయలకు పెంచారని ఇదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక టారిఫ్ రూ.1000 మాత్రమేనని మంత్రి వివరించారు. ఇక్కడ కూడా ఎంత దోపిడీ జరిగిందో గమనించాలన్నారు. ఇక టీవీ ప్రకటనల విషయానికి వస్తే టీ ఛానల్ కు సెకనుకు రూ.3000 గా రేటు నిర్ణయించారని అదే ఈటీవీకి రూ.2500 ఎన్టీవీకి రూ.3000 రూపాయలుగా ఉందని తెలిపారు. ఈ రేట్లను గమనిస్తే ప్రజల సొమ్మును బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసిందో స్ఫష్టమవుతుందన్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని , ఈ అంశాలపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
ఏప్రిల్ నెలలో భూ భారతి
రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా ధరణి పోర్టల్ ఆర్వోఆర్ చట్టం 2020 ద్వారా తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు, బాధల నుంచి శాశ్వత విముక్తి కల్పించేలా దేశానికి రోల్ మోడల్గా ఉండేలా భూ భారతి చట్టాన్ని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం. రైతులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టిన ధరణిని అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, పిసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్రెడ్డిగారు, సిఎల్పీ నాయకునిగా భట్టి విక్రమార్క గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మరికొన్ని రోజుల్లో ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలులోకి తీసుకురాబోతున్నాం. అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టం అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆమోదం పొందిన మూడు నెలల్లోనే విధి విధానాలను రూపొందించి చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే తుది అంకానికి చేరింది.
సచివాలయంలో కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేయకుండా విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పకడ్బందీగా భూ భారతి చట్టాన్ని తయారు చేసినట్టుగానే విధివిధానాలను కూడా రూపొందించాం. ఇందుకోసం కొన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ శాఖ రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇతర ఉన్నతాధికారులతో రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. “ఎలాంటి విధి విధానాలు తయారు చేయకుండానే 2020 ఆర్వోఆర్ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ఎదురైన ప్రతికూల పరిస్ధితులు దృష్టిలో పెట్టుకుని విధివిధానాలను రూపొందించామని తెలిపారు.
గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు చర్యలు
గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడానికి గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గ్రామ పాలన అధికారులను నియమించడానికి కార్యాచరణను రూపొందించాం. ఇప్పటికే ఈ పోస్టుల మంజూరు చేశాం. విఆర్వో, విఆర్ఎ వ్యవస్థలో ఇంటర్మీడియట్ ఆపైన చదివిన సుమారు 6000 మంది విఆర్ఓ/విఏఓ వ్యవస్థలోకి రావడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
వీరికి ఒక టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం 31 మండలాలు రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ జి.ఓ. ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ శాసనసభలో చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో జరిగిన భూలావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ ను విధివిధానాలతో ప్రజల ముందుకు రానుంది. రాష్ట్రంలో ఉన్న పేద, నీరు పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేసింది…. అది ఇందిరమ్మ ఇల్లు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.
రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. కానీ మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం తో పాటు, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సహాయం అందిస్తుంది. ఈ ఏడాది 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 562 గ్రామాల్లో 70,122 ఇండ్లను 2025 జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. ఇప్పటివరకు 6,131 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన ఇళ్ల గ్రౌండింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్లకు చెల్లింపులు జరుపుతామన్నారు.
లక్ష రూపాయల రీ-పేమెంట్ లోన్
ఇంటి నిర్మాణానికి ముందుగా లక్ష రూపాయలు సమకూర్చుకోలేని నిరుపేద ఆడబిడ్డల కోసం స్వయం సహాయక గ్రూపుల(ఎస్హెచ్జి) ద్వారా లక్ష రూపాయల రీ-పేమెంట్ లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పటికే నా నియోజకవర్గమైన పాలేరు లో ఈ ప్రక్రియను ప్రారంభించాం. గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర కనీసం మౌళిక సదుపాయాలను విస్మరించింది. నీళ్ళు ఉంటే కరెంట్ లేదు, కరెంట్ ఉంటే డ్రైనేజ్ లేదు. ఇలా అన్నీ సమస్యలే. మా ప్రభుత్వం రూ.196 కోట్ల రూపాయలతో ఆ కాలనీలలో మౌళిక సదుపాయాలను కల్పించడానికి చర్యలు చేపట్టిందన్నారు.
లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం:
వీటితో పాటు ప్రతి మండలం, పట్టణంలో భూ విస్తరణ, భూ లావాదేవీలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5500 నుంచి 6000 లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులో ఉంచబోతున్నాం. సర్వేయర్ల కోసం విఆర్ఓ/విఏఓల నుంచి స్వచ్ఛంధంగా దరఖాస్తు చేసుకున్న దాదాపు 300 మందికి టెస్టు నిర్వహించి శిక్షణ ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలను అందించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు.
స్లాట్ బుకింగ్ విధానం
మొదటి దశలో పైలట్ ప్రాజెక్టు కింద సుమారు 17 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతుంది. ఎవరూ ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా ప్రజల అమూల్యమైన సమయం వృధా కాకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానంలో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. గత ప్రభుత్వం అనేక నిబంధనలతో సెమీ–అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ పేరుతో ఒక జీ.ఓ ని తీసుకొచ్చింది. కానీ ఇది అమలు చేయలేదు.
గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్లాట్ ల గురించి సుమారు 25 లక్షలు, లే-అవుట్ల గురించి 13 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ భరోసా కల్పించే విధంగా ఎల్ఆర్ఎస్ సమస్యకు విముక్తి కల్పించే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్టు కింద సుమారు 17 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతుంది. ఎవరూ ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా ప్రజల అమూల్యమైన సమయం వృధా కాకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానంలో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
గత ప్రభుత్వం అనేక నిబంధనలతో సెమీ–అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ పేరుతో ఒక జీ.ఓ ని తీసుకొచ్చింది. కానీ ఇది అమలు చేయలేదు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్లాట్ ల గురించి సుమారు 25 లక్షలు, లే-అవుట్ల గురించి 13 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ భరోసా కల్పించే విధంగా ఎల్ఆర్ఎస్ సమస్యకు విముక్తి కల్పించే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.