ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెల్లో
నిలిచేది బీఆర్ఎస్సే
•రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా బీజేపీ, కాంగ్రెస్లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో స్టేషన్ ఘన్పూర్కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మాయమాటలు చెప్పారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వొచ్చి 450 రోజులు అవుతుందని.. రోజుకు ఒకరి చొప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు.
భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం అని కేంద్రం పార్లమెంట్లో చెప్పిందని గుర్తు చేశారు. మరి కాలం తెచ్చిన కరువా..? కాంగ్రెస్ తెచ్చిన కరువా..? అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్లో ఒక పర్రె వడితే.. దానికి కాంగ్రెస్ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా లొల్లి పెట్టారు. మరి ఇవాళ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరెత్తరు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు. ఖమ్మం వద్ద పెద్దవాగు కొట్టుకుపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ ఉంది. కాళేశ్వరంలో ఒక పిల్లర్కు పర్రె వడితే.. ఎన్డీఎస్ఏ వాలిపోయింది. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నెల్ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది మరి ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు. ఏ బీజేపీ వాళ్లు మాట్లాడరు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడం లేదు.
సుంకిశాల కూలిపోతే గవినోళ్ల శ్రీనివాస్ ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకుంటే.. ఇది దేశ భధ్రతకు సంబంధించిన అంశం.. సమాధానం ఇవ్వమని చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో మోదీ వచ్చి.. కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతుంది.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని గర్జించారు. కానీ ఇంతవరకు చర్య లేదు. రేవంత్ రెడ్డి బామ్మర్ది కంపెనీ శోధా 2 కోట్ల లాభం ఆర్జించింది. అమృత్ స్కీంలో రూ. 1137 కోట్ల కాంటాక్ట్ ఇచ్చిండు బామ్మర్ది కంపెనీకి రేవంత్ రెడ్డి. దీని మీద విచారణ చేయాలని సంబంధిత కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశాం. ఆరు నెలలు అవుతంది.. ఇప్పటి వరకు స్పందన లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ రైడ్ అయింది.. ఏం జరిగిందో తెలియదు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగవని తెలుసు కాబట్టి.. ఆ ఇద్దరు కలిసి కేసీఆర్ పార్టీని ఖతం చేయాలన్నదే ఆలోచన చేస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్కై సక్సెస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు.