ప్రకటించిన మంత్రుల బృందం
•సహాయ చర్యల్లో పాల్గొన్న సంస్థలతో సమీక్ష
హైదరాబాద్ (దోమలపెంట), ప్రజా తంత్ర, ఫిబ్రవరి 25 : శ్రీశైలం ఎడమ కా లువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణా రావు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల బృందం మంగళవారం ఎస్ఎల్బిసి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయ కార్యక్రమాలను స్వయంగా అంచనా వేశారు.
అనంతరం, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణలు ప్రాజెక్ట్ స్థలంలోని జేపి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రమాద సంఘటన జరిగిన విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తోసహా వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. ఎస్ఎల్బీసి సంఘటన స్థలంలో 40 నుంచి 50 మీటర్ల మేర బురద నిండుకుందని తెలిపారు. ఈ దుర్ఘటనలో 42 మంది సురక్షితంగా బయటికి రాగా, 8 మంది లోపల చిక్కుకున్నారని వివరించారు.
బురద నీటిని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని వివరించారు. ఎడమ కాలువ టన్నెల్ లో 11 కిలోమీటర్ల తర్వాత నీటితో కలిగివుందని, అయినప్పటికీ 11 .5 కిలోమీటర్ల దూరం వరకు వివిధ ఏజెన్సీల రక్షణ బృందాలు వెళ్లగలిగాయని వివరించారు. 13 .50 కిలోమీటర్ల వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బీ.ఎం ) ఉందని, అక్కడికి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇక్కడి నుంచి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనదన్నారు. సొరంగంలో ఎంత దూరం వరకు బురద, నీరు ఉందనేది జీ.ఎస్.ఐ., ఎం.జీ.ఆర్.ఐ లు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు. చివరి 40 మీటర్లలో నీరు, బురద మట్టితో ఉందని ఏ విధమైన రాళ్లు, ఇతర ఘన పదార్థాలు ఉన్నట్టు కనిపించడం లేదని స్పష్టం చేశారు. 15 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు ఈ బురద ఉందని అన్నారు. ప్రస్తుతం టన్నెల్ లో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ బురదనీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలుగా ఉందని పేర్కొన్నారు. కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్ బెల్ట్ కు రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోగా మరమ్మతులు పూర్తవుతాయని తెలిపారు.
ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల ఘణపుతడుల బురదను బయటికి తీయవచ్చని అన్నారు. వీటిని మరింత త్వరితగతిన వెలికితీయడానికి అక్కడికి వెళ్లగలిగే జేసీపీలను తీసుకు పోయేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. టన్నెల్ లో గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట నీరు వొస్తుందని తెలిపారు. లోపలినుండి నీటితోపాటు, బురదను కూడా బయటికి తీయడానికి ఒకే పైప్ లైన్ వినియోగించనున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణా శాఖ స్పెషల్ సి.ఎస్. అర్వింద్ కుమార్, ఎస్పిడిసీఎల్ సీఎండీ ముషరాఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ ఈ. శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐజి చౌహన్, ఎల్ అండ్ టి టన్నెల్ రంగ నిపుణులు క్రిస్ కూపర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధి గ్రేన్ మేకర్డ్, ఉత్తరాకండ్ లో ఇలాంటి దుర్గటనలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణుల బృందం, జేపీ కి చెందిన పంకజ్ గౌర్, నేవీ కి చెందిన మరికోస్, ప్రసాద్, ఆర్మీ కల్నల్ వికాస్, కల్నల్ సురేష్, మోర్త్ డైరెక్టర్ అన్షు కల్కు, నేషనల్ హైవేస్ ఇన్ ఫ్రా , ఎన్డిఆర్ ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, అగ్నిమాపక శాఖ రీజినల్ ఫెయిర్ ఆఫీసర్ సుధాకర్ రావు, హైడ్రా కు చెందిన పాపయ్య, ఎస్సిసిఎల్ అధికారి సదానందం,, ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ ర్యాట్ మైనర్స్ గ్రూప్ ప్రతినిధి ఫిరోజ్ కురేషి, నవయుగ కు చెందిన జెవిఎల్ఎన్ కుమార్, ఇతర ఉన్నతాధికారుల బృందం హాజరయ్యారు.





