గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : గురుకుల హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన ఘటన మరువకముందే బుధవారం మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణమని అన్నారు. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన ఘటన ఆందోళన కలిగిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పదేపదే ఇలాంటి ఘటన జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఏం జరుగుతున్నది? విద్యా ర్థుల ప్రాణా లంటే ప్రభు త్వానికి పట్టింపు లేదా? పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదా? చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయమైన చర్య. కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. విద్యార్థుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించండి. గురుకులాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.