అప్పుల వారసత్వానికి ఆద్యులు ఎవరు?

మీ హయాంలో అక్షరాలా రూ.7 లక్షల కోట్ల అప్పులు
మంత్రి కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి సీతక్క కౌంటర్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌16: పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ లాంటి ప్రాజెక్టుల పేరుతో అందినకాడికి అప్పులు తీసుకున్నారు. ఈ లెక్కలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక బయటపెట్టింది. అసెంబ్లీ సాక్షిగా అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. అధిక అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా వివరించింది. అయినా కూడా తాము మ్యానేజ్‌ చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే, 10 నెలల కాంగ్రెస్‌ పాలనలో రూ.80వేల కోట్లకు పైగా అప్పులు చేసినట్టు మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. దీనికి మంత్రి సీతక్క కౌంటర్‌ ఇవ్వడంతో రాష్ట్ర అప్పులపై మరోసారి చర్చ జరుగుతోంది.రేవంత్‌ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు అని, 10 నెలల్లో ఇదో రికార్డ్‌ అని విమర్శించారు కేటీఆర్‌. అప్పు తప్పు అన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలని సెటైర్లు వేశారు.’’ఎన్నికల హమీలేవీ తీర్చలేదు.

ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు? బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? అప్పు శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి? బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం. ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం’’ అని అన్నారు కేటీఆర్‌. కానీ, రేవంత్‌ రెడ్డి తెస్తున్న అప్పుల అడ్రస్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా వేయకుండా, కొత్త ప్రాజెక్టు కట్టకుండా, నెలలపాటు జీతాలు ఇవ్వకుండా, ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అంటూ విమర్శించారు. అప్పులపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి సీతక్క. ‘’తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది ఎవరు? అప్పుల వారసత్వానికి ఆద్యులు ఎవరు? మీ హయాంలో అక్షరాలా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతిరోజు టంచన్‌గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.

అంటే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుంది. అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి, రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలి’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు సీతక్క. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను చెల్లించలేదని, చేసిన పనులకు బిల్లులు పెండిరగ్‌లో పెట్టారని మండిపడ్డారు. 5 వేలకోట్ల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆరోగ్య శ్రీ, కాంట్రాక్టర్లకు పెండిరగ్‌ బిల్లులు, సర్పంచుల బకాయిలు, విద్యుత్‌ సంస్థలకు, ఆర్టీసీకి, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె, ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ నిధుల పెండిరగ్‌, ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి ఇప్పుడు బుకాయిస్తే ఏలా అని ప్రశ్నించారు.

’’మీ నిర్వాకంతో గాడి తప్పిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఈ 10 నెలల కాలంలో 18 వేలకోట్ల పంట రుణాలను ప్రజా ప్రభుత్వం మాఫీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల వంటింటి భారం దించేందుకు రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌, సామాన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి శాం. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌ కార్డులు, ఇంటిగ్రేటెడ్‌ గురుకులాల ఏర్పాటు, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం. అయినా మీరు అప్పులు, బకాయిలు, హమీల గురించి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది’’ అంటూ మండిపడ్డారు సీతక్క.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *