త్వరలోనే మావోయిస్టులేని భారత్‌

  • ప్రస్తుతం దేశంలో కొన ఊపిరితో మావోయిజం..
  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ మృతుల్లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ నేత జయరాం అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. మావోయిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. మావోయిస్టు రహిత భారత్‌ దిశగా కీలక అడుగు పడిందన్నారు. మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమన్నారు. ఒడిశా- ఛ‌త్తీస్‌గ‌డ్ సరిహద్దుల్లో.. సీఆర్పీఎఫ్‌, ఎస్‌ఓజీ ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌డ్ పోలీసులు 14 మంది మావోయిస్టులను జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా మట్టుబెట్టారని తెలిపారు. మావోయిస్టు రహిత‌ భారత్‌ లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌తో మావోయిజం కొన ఊపిరితో ఉన్నట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.

సోమవారం జరిగిన ఆపరేషన్‌లో.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందగా, ఓ కోబ్రా జవాన్‌ గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున .. మెయిన్‌పుర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మృతిచెందారు. దీంతో మావోయిస్టుల మృతుల సంఖ్య 14కు చేరినట్లు ఆయన చెప్పారు. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు జయరాం అలియస్‌ చలపతిపై కోటి రూపాయల నజరానా ఉన్నట్లు గరియాబంద్‌ ఎస్పీ నిఖిల్‌ రకీచా తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా జనవరి 19న కులరీఘాట్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలైందన్నారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రదేశం నుంచి భారీ స్థాయిలో ఫైర్ ఆర్మ్స్‌, అమ్యూనిషన్‌, ఐఈడీలు, సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిళ్లు రికవరీ చేసినట్లు చెప్పారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి భద్రతా దళాలను ప్రశంసించారు. 2026 మార్చి నాటికి ఛ‌త్తీస్‌గఢ్ నుంచి మావోయిజాన్ని తరిమివేయనున్నట్లు చెప్పారు. సైనికుల సాధించిన విజయం అద్భుతమని, వారి సాహసానికి సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఈ ఏడాది ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 40 మంది మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్‌ జిల్లాలో జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాది ఛ‌త్తీస్‌గఢ్‌లోని భద్రతా దళాలు వేర్వేరు ఘటనల్లో 219 మంది మావోయిస్టులను హతమార్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page