పదేళ్లల్లో ఒక్కరేషన్‌ కార్డయినా ఇచ్చారా?

  • మాపై విమర్శలు చేయడం దారుణం
  • ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు
  • ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం
 పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వని బిఆర్‌ఎస్‌ వాళ్లు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ది జరుగుతుందని మంత్రి అన్నారు. గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్‌ కార్డులు రానివారు కానీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో దరఖాస్తులు పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు .. వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్‌ కార్డు అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 10 వేల రూపాయలను 12 వేలకు పెంచడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. దేశంలోనే మొదటి సారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల మాదిరి ఈనెలలోనే మరో 4 పథకాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తిస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. గ్రామాల్లో మంగ‌ళ‌వారం నుంచి గ్రామ సభలు జరుగుతుండడంతో ఎవరికైనా అర్హత ఉండి రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఉంటే అధికారులకు మీ పూర్తి సమాచారాన్ని ఇవ్వాల‌ని, కింది స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రేషన్‌ కార్డుల, ఇందిరమ్మ ఇళ్లపై జరుగుతున్న తప్పుడు సమాచారంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వారికి కాంగ్రెస్‌ క్యాడర్‌ అండగా నిలబడాలని  మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page