•పురుగుల మందు తాగి ముగ్గురు మృతి… మరొకరి పరిస్థితి విషమం
•మంచిర్యాల జిల్లాలో విషాదం
మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగడంతో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మొండయ్య (55) అనే రైతు అప్పుల బాధతో భార్య శ్రీదేవి (50), కూతురు చైతన్య (22), కొడుకుతో కలిసి పురుగుల మందు తాగారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ మొండయ్య, భార్య శ్రీదేవి, కూతురు చైతన్య మృతిచెందగా కొడుకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అప్పుల బాధ భరించలేక ఉసురు తీసుకోవడంతో పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.