కేసీఆర్ పోరాట ఫలితమే..
•తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడింది
•1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం
•చంద్రబాబు కోసం రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్ రెడ్డి
•రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ ది
•సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 11 : ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి.. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వ్యక్తి నేడు తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించడం వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమేనని స్పష్టం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి వైఖరి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఎవరో దయ వల్ల తెలంగాణ వొచ్చిందనడం ఉద్యమ కారులను, తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డు పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఆంధ్ర లాబియింగ్కు తలొగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కింది నెహ్రూ. 1969 ఉద్యమాన్ని ఇనుప కాళ్లతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది. అమాయకులను బలి తీసుకుంది. తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షను కాలరాశారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకుంటే, పోరాటం చేయకుంటే అసలు తెలంగాణ మాటే లేదు. అసెంబ్లీలో నాటి పాలకులు తెలంగాణ పదం నిషేధించారు. తెలంగాణ బదులు వెనుకబడ్డ ప్రాంతం అనాలని హుకుం జారీ చేశారు. 66 ఏండ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో జై తెలంగాణ అంటే పాపం.అలాంటి సమయంలో కేసీఆర్ పార్టీ పెట్టారు, ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
2004లో హామీ ఇస్తే కేంద్ర క్యాబినెట్ లో చేరారు. తెలంగాణ ఇవ్వక పోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని కాలరాసే యత్నం చేశారు. కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్ యూ ఆఫీసు దాకా తిరిగారు. దేశంలో 32 రాజకీయ పార్టీలను కేసీఆర్ వొప్పించి మెప్పించి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చారు. ఇది చరిత్రలో ఉన్న వాస్తవం.ఆ సమయంలో ఇక్కడ వైయస్ తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా బీడా అని ఎద్దేవా చేశారని హరీష్ రావు తెలిపారు. .హైదరాబాద్ పోవాలంటే పాస్ పోర్టు వీసా కావాలని అని వైఎస్ఆర్ బహిరంగ సభలో చెప్పారని తెలిపారు. అయినా కేసీఆర్ తెలంగాణ కోసం నిరంతరం శ్రమించారని, అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు. చివరకు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామ చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ అని, చ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే అంతమంది చనిపోయేవారా అని హరీష్ రావు ప్రశ్నించారు. నా శవ యాత్ర, లేదంటే జైత్ర యాత్ర అని, తెలంగాణ వొచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ ఉద్యమానికి కూర్చొంటే ఖమ్మం తరలించారని, ఖమ్మం జైల్లో పెట్టి ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితం కాదా? చిదంబరం జయశంకర్ కి ఫోన్ చేశారు. జయశంకర్, కేసీఆర్ రాసి ఇచ్చిందే చిదంబరం చదివారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారని హరీష్ రావు గుర్తుచేశారు. .