- ఇప్పటివరకు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ
- రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం
- రైతుభరోసా నిధులు జమ ప్రారంభించాం..
- వెల్లడించిన వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరావు
రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమను తిరిగి బుధవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలోకి బుధవారం నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు బీమాకు 3000 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని , ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్ధతు ధరకు సేకరించామని తెలిపారు. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు పంటలను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్దనుంచి మద్ధతు ధరకు కోనుగోలు చేశామని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయిందని తెలిపారు. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 10,547 కోట్లు, ఖరీఫ్ లో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు, 12,178.97 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ కోసం ప్రభుత్వం. 1154 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.