- గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
- సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ.2 కోట్లు
- గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష
- పార్టీలకు అతీతంగా హాజరైన ఎస్టీ ఎమ్మెల్యేలు
సమాజానికి దూరంగా ఉన్న మన గిరిజన, ఆదివాసీల అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామని గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు మురళి నాయక్, రామ్ దాస్ నాయక్, వెడ్మ బొజ్జు, జాలే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లాం వెంకట్రావు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాథవ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత వెనుకబడ్డ జాతులు గిరిజన ఆదివాసులేనని.. మన అభివృద్ధికి ఐకమత్యంతో కలిసి పని చేసుకుందామన్నారు.
ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధికారులు నివేదిక సమర్పించాలని, ఆ నివేదిక ఆధారంగా బడ్జెట్లో ప్రత్యేక పథకాలు రూపొందించుకుందామన్నారు. గిరిజన సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క వెల్లడించారు. గత పది సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, గత ప్రభుత్వం పోడు సమస్యలను పట్టించుకోలేదు, ఐటీడీఏ లను బలహీనపరిచిందని ఆరోపించారు. ఇందిరా జలప్రభ వంటి పథకాలకు నీళ్లు కేటాయించకుండా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, ఎస్టి ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించిన అంశాలను సీఎంకు నివేదిస్తామని సీతక్క చెప్పారు.
గురువారం ముఖ్యమంత్రితో ఎస్టి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతామని, సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవల కోసం రూ. 2 కోట్లు కేటాయిస్తున్ననట్లు చెప్పారు. ప్రతి గిరిజన పాఠశాలలో, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఈనెల 15 న ఘనంగా నిర్వహించుకుందామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలే సమయమే మిగిలి ఉందని, ఎస్టి సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు పనులను వేగవంతం చేయాలని, ఎస్టి సంక్షేమ శాఖ నిధులను ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లించొద్దని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో, ఐటిడిఏ ఏరియాల్లో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, గిరిజన పాఠశాలల్లో, వసతి గృహాల్లో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, భవనాల నిర్మాణం కోసం రూ. 250 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు, హాస్టల్లో సిబ్బంది ఖాళీల జాబితాను సమర్పించాలి. సీఎంతో చర్చించి పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెడతామని మంత్రి సీతక్క వెల్లడించారు.