విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూ
:రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
•మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై సమీక్ష
హైదరాబాద్ ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : గురుకులాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యత తప్ప నిసరిగా ఉండాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఏంజెపి గురుకులాల సెక్రటరీ సైదులు, ఆర్సీవో లు, డిసివోలు , ప్రిన్సిపాళ్లతో జూమ్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ఇప్పటికే సొంత భవనాలు ఉన్న 21 గురుకుల పాఠశాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. 4 సొసైటీ కార్యదర్శులతో కలిసి మెనూ చార్టు ఫైనల్ చేసి విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వెంటనే వారికి చికిత్స అందించాలన్నారు. విద్యా, ఆహారం నాణ్యత ప్రమాణాల కోసం మహాత్మ జ్యోతిబాపూలే లో టాస్క్ ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేశామని, మెరిట్ విద్యార్థులను అభినందించాలని, వారికి కావలసిన ప్రత్యేక అవసరాలు ఏమైనా ఉంటే సెక్రటరీ దృష్టికి తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. రానున్న పబ్లిక్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు మంచి రిజల్టస్ సాధించేలా ప్లాన్ అఫ్ యాక్షన్ రెడీ చేయాలి. వొచ్చే పదవ తరగతి పరీక్షలలో ఎం జె పి విద్యార్థులు మంచి రిజల్టస్ సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలి. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి లో విద్య నైపుణ్యాలను పెంచడానికి కృషి చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారం, వసతి సదుపాయాలు కల్పిస్తూ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. అధికారులు నిర్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని మంత్రి హెచ్చరించారు.
బీజేపీ, బిఆర్ఎస్ వేరు కాదు..
ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. బీజేపీ, బిఆర్ఎస్ వేరు కాదని వాళ్లు ఇచ్చిన చార్జిషీట్ ను రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్లీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భవ్యం కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అని శాపనార్తాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన చార్జిషీట్ లో ప్రజా సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు.