సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా

18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌కోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్‌, ‌సత్యవతి రాథోడ్‌, ‌తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ ‌స్టేట్‌మెంట్లను కోర్టు రికార్డు చేయనుంది. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ది కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ ‌సెక్షన్‌ 356 ‌కింద క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ ‌గతంలోనే లీగల్‌ ‌నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేరొన్నారు. ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మంత్రిపై పరువు నష్టం దావా వేసినట్టు తెలిపారు.

తాను ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తొమ్మిదేండ్లకుపైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని పిటిషన్‌లో కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా కొనసాగు తున్నానని తెలిపారు. రాష్ట్రానికి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు సాధించేందుకు రాష్ట్రం తరఫున విదేశాల్లో జరిగిన అనేక సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాంటి తనపై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వొచ్చిన వార్తలను, సోషల్ ‌మీడియాలోని కథనాలను, పలు టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను పెన్‌‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు.

పత్రికల్లో వొచ్చిన క్లిపింగ్‌లను, ఫోటోలను పిటిషన్‌కు జోడించి దాఖలు చేశారు. కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి, ఎన్నికల సంఘంతో చీవాట్లు తిన్న విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలను రాజకీయపరమైన వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రగా చూడాలని కేటీఆర్‌ ‌తన పిటిషన్‌లోవిజ్ఞప్తి చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాల పరిగణలోకి తీసుకొని, ఆమెకు చట్ట ప్రకారం శిక్ష వేయాలని కోర్టును కోరారు. కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌ ‌కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ ‌కూడా చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌కోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *