గాయం చేసిన కాలం!

ఉన్నత విద్యావంతుడై, ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండి, ఎంతోమందికి విద్య నేర్పినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబాకు తీవ్ర అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు విద్యార్థులు, ప్రజలు. ఆయనే ఒక ధిక్కారస్వరం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అనేటువంటి ధోరణి ఆయనది, ఆయన భార్య వసంతది. ఎవరైనా సహాయకులు ఉంటే తప్ప కదలలేనటువంటి పరిస్థితి ఆయనది. అలాంటి ప్రొఫెసర్‌ సాయిబాబాను రోడ్డు మీద నుంచి జైలుకు తీసుకెళ్లారు. భారత దేశంలో హిందుత్వ ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ పైన హక్కులపై రోజు ఎక్కడో ఒకచోట నిర్బంధమనేటువంటిది జరుగుతుంది. తన మేధస్సుతో విద్యార్థులకు ఉన్నత విద్యాబుద్ధులు నేర్పుతూ, సామాజిక,రాజకీయ చైతన్యాన్ని కలిగించినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబా ఆలోచనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండేవి.

ఇది ఇలానే ఉంటే మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హక్కుల కార్యకర్తలను, హేతువాదులను, లౌకిక శక్తులను, ప్రజాస్వామిక శక్తులను, కవులను, రచయితలను, కళాకారులను, ప్రశ్నించేటువంటి గొంతులను ఏకం చేసిన సాయిబాబాతో ప్రమాదం ఉందని ముందే గ్రహించి కొన్ని శక్తులు ఏదో విధంగా వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. తాను చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఒక ప్రొఫెసర్‌ అనారోగ్యంగా ఉన్నా, కని, పెంచి, చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటు ఎన్నో ఒడిదొడుకులను, కష్టాలు నష్టాలను ఓర్చుకొని పెంచి పోషించినటువంటి తల్లి అనారోగ్యంగా ఉన్న మాట్లాడలేదు. చనిపోతే కూడా పెరోల్‌ ఇవ్వలేదు. ఇలా ఒంటరిగా చీకటి గదిలో ఎన్నో ఇబ్బందులకు గురై 3,588 రోజులు ఉండి కేవలం బతికి బయటకు వచ్చారు. ఆయన జీవితం ఆలోచన, ఆచరణ, అపారమైనది.

ఇలా ఆయనను కాలం, గాయం చేసింది. ఎన్నెన్నో రంగాలలో బృహత్తరమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన పుట్టుకే సమస్తాన్ని నిర్ణయించిందని భావించేవారు. తెలంగాణలో పుట్టక పోయిన తెలంగాణ కోసం ఆలోచించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ప్రాణాలు బలితీసుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ప్రొఫెసర్‌ సాయిబాబా ఒకరు. నేను ఒక తెలంగాణ వాది. తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమతో రెండు దశాబ్దాలకు పైగా గడిపినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్‌ 2 నాటికి నాగపూర్‌ జైల్లో ఉన్నాడు. తప్పుడు కేసులో ముందే అరెస్టు అయి ఉన్నాడు. 2016 ఏప్రిల్‌లో బెయిల్‌ వచ్చిన సందర్భంగా తల్లిని చూడడానికి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణలో మొదటిసారి కాలు పెట్టినప్పుడు అమరులకు నివాళుల ర్పించినటువంటి ఓ ఉద్యమకారుడు, ప్రొఫెసర్‌ సాయిబాబా. ఎక్కడ సమావేశాలు జరిగిన అందులో పాల్గొని తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేవారు.

వికలాంగుడైనటువంటి ఆయనను జైల్లో నిర్బంధించి, ఎంతగానో హింస పెట్టడం, దేశంలోని ప్రజలంతా గమనించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఐదుగురితో పాటు ఆయనను అరెస్టు చేసి జైల్లో ఉంచారు. 90% వికలాంగుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్‌ పదేళ్ల కష్టానికి ముగింపు దొరికింది. కోర్ట్‌ తీర్పుతో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ప్రొఫెసర్‌ సాయిబాబా ఆశయాల కోసం బతికాడు. ఎక్కడ అన్యాయం జరిగిన వ్యతిరేకించి,పోరాటం చేశాడు.రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కాపాడడానికి తీవ్ర కృషి చేశాడు. ఆయన జీవితం విషాదాల, పోరాట, ఆరాటాలు జీవితంగా చెప్పవచ్చు. 2022లో బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. జైలులో రోజుకు ఒక బకెట్‌ నీళ్ళు మాత్రమే లభించేవి, తనకు వెన్నుపాములో సమస్య ఉందని చెప్పినా కూడా, పోలీసులు తన చేతులు పట్టుకొని లాక్కొని పోయే వారిని, దానివల్ల నరాలు దెబ్బతిని ఎడమవైపు శరీరం పనిచేయడం మానివేసిందని ఆయన తెలపడం జరిగింది. ఆయన జీవితం బాధాకరం. ఎందుకంటే విడుదలైన తర్వాత ఢల్లీిలో మార్చి9వ తేదిన విలేకరులతో మాట్లాడుతూ నేను మీ ముందు సజీవంగా కనబడుతున్నాను కానీ శరీరంలో అవయవాలన్ని విఫలమైనాయని అన్నారు.

ఇలా బయటికి వచ్చినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబా పీడిత, తాడిత ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తూ సమాజ సేవే ముఖ్యమని ముందుకు సాగాడు .ఇలా అద్భుతమైనటువంటి తెలంగాణ వాదిగా, ఉద్యమకారుడుగా 35 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేశారు. అదే కాదు జైల్లో ఉన్నప్పుడు జైలలో ఖైదీల హక్కుల గుర్తింపు, ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పోరాటం చేస్తే వాటిని తక్షణమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేరుతో అంతర్జాతీయ వేదికల పైన ప్రజాస్వామ్య విధానాలను, ప్రజల జీవిత విధానాన్ని పంచుకున్నారు. ఇలా వారి పక్కనే ఉండేటువంటి ప్రజల గురించి కాకుండా, పర్యావరణం గురించి, ప్రకృతి గురించి ఆలోచించి ఆరాటపడేటువంటి మనుషుల్లో సాయిబాబా ఒకరు. ఆదివాసుల హక్కుల కోసం, పోరాటం సల్పి, వారిలో చైతన్యాన్ని తీసుకు వచ్చినటువంటి ఆత్మబంధువుగా నిలిచాడు. 57 ఏళ్ల వయసులో సాయిబాబా జీవితం ముగియడం విషాదకరం. ఇలా జైలు జీవితం గడపడం ద్వారా ఆరోగ్యం పాడై, ఎంతో కాలం కుటుంబంతో, సన్నిహితులతో బతకాల్సినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబా ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం.
     -డా.మోటె చిరంజీవి
 సామాజిక వేత్త, విశ్లేషకులు
 సెల్‌ : 9949194327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page