ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
‘‘బర్డస్ ఆఫ్ తెలంగాణ’’పాకెట్ గైడ్ ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : పక్షుల ఆవశ్యకత గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. పక్షులపై అవగాహన కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు రూపొందించిన ‘‘బర్డస్ ఆఫ్ తెలంగాణ’’ పాకెట్ గైడ్ ను బుధవారం ప్రజా భవన్ లో డిప్యూటీ సిఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకం అవసరాన్ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రెసిడెంట్ ఆడెపు హరికృష్ణ, కోర్ కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పాకెట్ గైడ్ ను రూపొందించడానికి వారు చేసిన కృషిని, వారి అవగాహన కార్యక్రమాలను తెలుసుకొని ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ పుస్తకం తెలంగాణ పక్షుల ఆహారం, వలసలు, పరిరక్షణ స్థితి గురించి తెలుసుకోవటానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ పుస్తకం విద్యార్థులు, ప్రకృతి ఔత్సాహికులు, విభిన్న ప్రేక్షకులను ప్రత్యేక జీవ వైవిధ్యంతో కూడుకొన్న తెలంగాణ ప్రకృతితో మమేకం కావటానికి ప్రోత్సహిస్తుందన్నారు. మొత్తం 252 ముఖ్యమైన పక్షి జాతులను కలిగి ఉన్న ఈ పాకెట్ గైడ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందించనున్నట్లు వివరించారు.
పట్టణ సరస్సుల పరిరక్షణకు కృషి చేసిన మాజీ డిజిపి తేజ్ దీప్ కౌర్ మీనన్.. పక్షుల పరిశీలనను ప్రోత్సహించడంలో హెబిపి ప్రత్యేక పాత్రను కొనియాడుతూ ఈ బృందం ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ బృందం ఇప్పటివరకు నిర్వహించిన 490ం ఉచిత బర్డ్ వాక్ ల ద్వారా పర్యావరణ పరిరక్షణపై పౌరులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని రూపొందించడానికి తమ చిత్రాలను అందించిన 30కి పైగా హెబిపి సభ్యులైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ల సహకారం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా యువతలో పక్షుల పరిశీలనను ప్రోత్సహించటానికి, వాటిని సంరక్షించటానికి ప్రభుత్వ మద్దతుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.