గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి
ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ
అలరించిన కల్పవృక్షవాహన సేవ

తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్‌ ‌వెంకయ్య అందుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్‌ ‌వెంకటయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు.

బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి.

వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్‌ ‌వెంకటయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page