నేలకొరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్
తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సిఎం, డిప్యూటి సిఎంలు
కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన
న్యూదిల్లీ/అమరావతి, మే 9: భారత్, పాకిస్తాన్ యుద్ధంలో ఓ తెలుగు జవాన్ వీర మరణం పొందాడు. శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో కన్నుమూశాడు. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతిబాయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీర జవాన్ ఈ దంపతుల ఏకైక సంతానం కావటం గమనార్హం. వీర జవాన్ మురళీ నాయక్ మరణంపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..’ దేశ రక్షణలో సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసన సభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ.. రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మురళీ నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
మురళి నాయక్ మృతి చెందడంతో వీర జవానుకు పలువురు నేతలు నివాళులర్పించారు. ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పోస్టు పెడుతూ …ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మురళి నాయక్ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్టప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ నివాళి
జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ కాల్పుల్లో జవాన్ మురళి నాయక్ వీర మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తునట్లు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.