- సాగునీటి ప్రాజెక్టులకు నిధులేవి?
- ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
- ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ.. నిధుల కేటాయింపులో వివక్ష చూపిందని, రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఈ బడ్జెట్ రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలను విస్మరించిందన్నారు.
కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించింది. ఈ విధానం కేంద్రం-రాష్ట్రాల ఆర్థిక సంబంధాల్లో రాష్ట్రాల న్యాయమైన వాటాను దెబ్బతీసేలా ఉంది. కేంద్ర బడ్జెట్లో కేంద్ర సహాయ పథకాలకు కేటాయింపు గతేడాది రూ. 4,15,356 కోట్ల నుంచి రూ. 5,41,850 కోట్లకు (30.5% వృద్ధి) పెంచబడింది. రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను పెంచాలనే రాష్ట్రాల డిమాండ్ను పరిగణించకుండా, సీఎస్ఎస్ పై ఆధారపడే విధానాన్ని మరింత పెంచడం ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయించబడినప్పటికీ, గతంలో ఆ రాష్ట్రం ఆదాయంలో ప్రాశస్త్యాన్ని చూపింది. ఆర్థిక లోటు అనుమతించిన పరిమితికి తక్కువగా ఉంది. అయితే, సమర్థవంతమైన వనరుల వినియోగ సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కేవలం తెలంగాణకే కాకుండా, దేశ అభివృద్ధికి కూడా నష్టం కలిగించే అంశమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతగా భావిస్తూ నిరంతరం పనిచేస్తుంది. కానీ, ఈ కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర సాగు ప్రాజెక్టులకు గణనీయమైన నిధులు కేటాయించలేదు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఈ బడ్జెట్ వైఫల్యం చెందింది. కేంద్రం వ్యవసాయ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతున్నా, తెలంగాణలోని సాగు ప్రాజెక్టులను పక్కనపెట్టడం దారుణమని అన్నారు.
కేంద్ర బడ్జెట్లో బీహార్లో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు కేటాయించింది. అయితే, తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి ఎలాంటి ప్రస్తావన లేదు. హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక ప్రధాన విమానాశ్రయంపై మోదీ సర్కారు ఆధారపడటం వల్ల రాష్ట్ర వృద్ధికి ఆటంకం కలుగుతోంది. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి ద్వారా ప్రాంతీయ సంయోగాన్ని మెరుగుపరచి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఏర్పడేది. తెలంగాణ, దేశంలో కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్విడియా, ఇంటెల్, అడోబ్ వంటి గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో “తెలంగాణ ఎఐ మిషన్” (టి- ఎఐఎం) విజయవంతంగా అమలవుతోంది. అయితే, గతంలో కేంద్రం ప్రకటించిన 3 ఎఐ కేంద్రాల స్థాపనలో తెలంగాణను పూర్తిగా విస్మరించడం దారుణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఏఐ కేంద్రాల ఎంపిక ప్రక్రియలో ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకం ప్రస్తావన లేదు..
ఈ బడ్జెట్ ప్రసంగంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తావన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 86,000 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఖర్చుచేసిన రూ. 89,263 కోట్ల కంటే తక్కువ. ఇది గ్రామీణ ఉపాధి కల్పనను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ ‘గరీబ్, యువ, అన్నదాత, నారీ’ (పేదలు, యువత, రైతులు, మహిళలు) సంక్షేమాన్ని ముందుగానే హైలైట్ చేసినప్పటికీ, వారిని ప్రోత్సహించే ఎటువంటి స్పష్టమైన కార్యక్రమాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కార్యాచరణ పథకం లేకుండా ఇచ్చిన హామీలు ప్రజలకు ఒరిగేలా ఉండవు. కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి రాష్ట్రాల హక్కులను విస్మరించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం సముచితంగా స్పందించాలని డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి చేశారు.