సున్నా శాతం పేదరికం :
ఆలోచనల్లో లక్ష్యాల దార్శనికత ను జోడించి, అంకెల్లో 50 లక్షల కోట్లకు పైగా చూపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం గురించి గురజాడ వారి మాటలతో ‘‘దేశమంటే మట్టి కాదోయ్/దేశమంటే మనుషులోయ్ అంటూ 2047 వంద ఏళ్ళ స్వాతంత్య్ర భారత్ ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ సాక్షిగా..! పేదలు,యువత, రైతులు,మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను చూపిస్తూ వారి ప్రసంగం కొనసాగింది.ప్రపంచం నేడు మా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి చర్చిస్తుందం టూనే, 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయపు పన్ను 12 లక్షల వరకు మినహాయింపు కల్పించటం ఊరట కలిగించే విషయం.సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తప్పవంటూ,సున్నా శాతం పేదరికం వుండేలా అభివృద్ధి భారతాన్ని నిర్మించుకోవాలంటూ మన బాధ్యతను గుర్తు చేశారు.
కృత్రిమ మేధ విస్తరణ తో కూడిన విద్య:
కృత్రిమ మేధ విస్తరణ తో చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయి. దానికనుగుణంగా మన విద్యా విధానంలో, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో మనం ముందుండాలి. అందుకే అందరికీ క్వాలిటీ విద్య లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు, డిజిటల్ శిక్షణ, ఈ -బుక్స్,విద్యా రంగంలో ఏఐ వినియోగం వంటివి స్వాగతించాల్సిన అంశాలుగా చెప్పుకోవచ్చు.పదేళ్ళలో ఐఐటీ ల్లో విద్యార్థుల సంఖ్య పెంపు, ఐదేళ్ళలో అదనంగా 75వేల మెడికల్ సీట్లు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు,ఐఐటీ మరియు ఐఐఎస్సీల్లో పరిశోధకులకు ఫెలో షిప్ లు,5 ఐఐటీ ల ఏర్పాటు,50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తదితర కార్యక్రమాల ప్రతిపాదనలు ఆశావాదపు అవకాశాలుగానే కనిపిస్తున్నాయి.
ఆహార కేంద్రంగా భారత్:
ప్రపంచ ఆహార కేంద్రంగా భారత్ వుండాలనే సంకల్పంతో వ్యవసాయానికి బడ్జెట్ లో ప్రముఖ పాత్ర అందించారు.ఆహార భద్రత కోసం జీన్ బ్యాంకు ఏర్పాటు,పీఎం ధన్ ధాన్య్ కృషి యోజన పథకంతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది,3లక్షల నుంచి 5 లక్షలకు కిసాన్ కార్డుల పెంపు, పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక,పత్తి ఉత్పాదకతను పెంచటం,గ్రామాలన్నింటికీ మంచి నీరు తదితర పథకాలతో రైతులకు లాభసాటి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను బడ్జెట్లో ప్రతిపాదించింది.
ఎలక్ట్రానిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగేలా ధరలు తగ్గించారు.క్యాన్సర్ మందులు,లిథియం బ్యాటరీల ధరల తగ్గుదలతో పాటు,ఉడాన్ పథకం ద్వారా 120 రూట్లలో విమాన ప్రయాణ సౌకర్యం,గిగ్ వర్కర్లకు ఆరోగ్య భీమా,గుర్తింపు కార్డులు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, ఎస్సీ మరియు ఎస్టీ మహిళల కోసం కొత్త పథకం,పర్యాటక ప్రాంతాల అభివృద్ధి,అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్ లు వంటి ఎన్నో వివిధ రంగాల కార్యక్రమాలతో ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది.
అభివృద్ధి భారతాన్ని నిర్మించుకోవాలంటూ: ముఖ్యంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులో మిత్రధర్మం మరియు రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోంది. సులభతర వ్యాపారాన్ని ప్రోత్స హిస్తూనే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. భారీ పెట్టుబడుల లక్ష్యంతో మూడో ఆర్థిక వ్యవస్థగా మరియు గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా వుంటూ వికసిత భారత్ గా మన సుదీర్ఘ ప్రయాణం ఎందాక వెళ్తుందో కాలమే నిర్ణయించాలి.స్క్రిఫ్ట్ బాగానే వుంది.మరి సినిమా ఎలా వుంటుందో మన భవిష్యత్తు చెప్పాలి. ఏదేమైనా…విశ్వ గురువుగా విశ్వ శాంతి కోసం మనదేశం పురోగమనంలోనే కొనసాగాలని ఆశిస్తూ…
ఫిజిక్స్ అరుణ్ కమార్
ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ
9394749536