తొలగించాలని కాంగ్రెస్..టచ్ చేయొద్దని బీఆర్ఎస్
కొనసాగుతున్న నేతల సవాళ్ల పర్వం
పార్కు స్థలం కబ్జా చేశారని, అక్రమంగా నిర్మించారని ఆరోపణలు
జీబ్ల్యూఎంసీ అధికారుల్లో టెన్షన్..
హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 5 : హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్థలం వివాదం రోజురోజుకూ ముదురుతుంది. అక్రమంగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ కార్యాయాన్ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా . పార్టీ ఆఫీస్ గోడలోని ఒక్క ఇటుక పీకినా ఊరుకునేది లేదని బిఆర్ ఎస్ నేతలు తెగేసి చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య వివాదం తీవ్రతరమవుతుండడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను పక్కనే నిర్మించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ జిల్లా ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రెండూ బాలసముద్రంలోని సర్వే నెంబర్ 1066లో నిర్మించారు..పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయింపుపై అప్పట్లో వివాదం కూడా చెలరేగింది. పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే బాలసముద్రంలోని పార్కు, పార్కు స్థలంలో పార్టీ ఆఫీస్ ను నిర్మించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆఫీస్ బిల్డింగ్ కు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా ఆఫీస్ ను వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో నిర్మించగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన దాస్యం వినయ్ భాస్కర్ పరాజయం చెందగా, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేరగా, దాని పక్కనే బీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకే రోజు రెండు పార్టీల కార్యక్రమాలు ఉంటే.. అటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఒక రకంగా గొడవలు, కొట్లాటలు ఫైటింగ్ జరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి. , తరచూ ఇబ్బందుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలంలో పార్టీ ఆఫీస్ ను అక్కడి నుంచి తరలించి, వేరే చోట ప్రభుత్వ స్థలం చూపాలని ఆయన అధికారులకు లేఖ రాశారు. దీంతో హన్మకొండ ఆర్డీవో ఎన్.వెంకటేశ్ ప్రభుత్వానికి చెందిన ఎకరం స్థలంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేటాయిచిన స్థలాన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్ కాపీలను అందించాల్సిందిగా లేఖ రాశారు.
దీంతో పర్మిషన్ తీసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో జూన్ 25న కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ గ్రేటర్ వరంగల్ సిటీ ప్లానర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు నేరుగా వినయ్ భాస్కర్ వద్దకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చే కుట్ర చేస్తున్నారని, పార్టీ కార్యాలయంలో ఇటుక పెల్ల కదిపినా.. గాంధీభవన్ కూలుతుందని హెచ్చరించారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లను టచ్ చేస్తే.. కాంగ్రెస్ ఆఫీస్ లను కూడా టచ్ చేయాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. విజయ్ భాస్కర్ లు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ పరిధి బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు స్పందించారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి ఎవరూ రావొద్దని అన్నారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి అప్పుడున్న నామినల్ రేట్ ప్రకారం స్థలం ఇచ్చారని వారు గుర్తుచేశారు జీవోలను అనుసరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించారని, వాటి జోలికి వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఆంధ్రా బ్యాంకుకు ఏ విధంగా కిరాయికి ఇచ్చారో తెలపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
పార్క్ స్థలంలో ఎకరం భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడని, పార్టీ కార్యాలయానికి ఇంటి నంబర్ లేదు.. ఎక్కడో స్థలం కేటాయిస్తే . పార్క్ స్థలంలో అక్రమంగా పార్టీ ఆఫీసు నిర్మించి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు . అధికారులను బెదిరించి నిర్మించిన అక్రమ నిర్మాణం తొలగించే వరకు ఎంత దూరమైనా వెళతామని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమ నిర్మాణమని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్పడంతో జిడబ్ల్యూఎంసీ అధికారులకు భయం పట్టుకుంది.. ఎలాంటి అనుమతి లేకుండానే పార్క్ కబ్జా చేశారని నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
సుమారు 5 ఏళ్ల పాటు అక్రమంగా కార్యాలయం నిర్మించి పార్టీ కార్యకలాపాలు నిర్వహించినా కూడా చర్య తీసుకోకపోవడంపై ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయన్న భయం వెంటాడుతుంది. మరోవైపు పార్టీ ఎవరి పేరు మీద ఉందో తెలియకుండానే కరెంట్ కనెక్షన్ ఇవ్వడం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే పార్టీ ఆఫీస్ కి విద్యుత్ కనెక్షన్ ఎలా వచ్చిందని దానిపై ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలు వివరాలు సేకరిస్తుండడంతో విద్యుత్ శాఖ అధికారులు సైతం జంకుతున్నారు. ఇలా అధికార, విపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు అన్నీ కూడా అధికారులను ఇరుకున పెడుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ చర్య తీసుకుంటారో అప్పుడు ఒత్తిడి మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసినందుకు తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు భయంతో వనికి పోతున్నారు.