– సీఎంవో నుంచి అజిత్ రెడ్డి ఔట్
– కొత్తగా ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా నియామకం
– ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్
- జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్
– అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటూ ఒకేసారి 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ అధికారి ఎన్.శ్రీధర్ను నియమించారు. అలాగే ఇప్పటివరకు సీఎంఓలో సేవలందించిన అజిత్రెడ్డికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొత్త బాధ్యతలను అప్పగించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ అధికారులకు అదనపు బాధ్యతలను కూడా కేటాయించింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులు కాగా ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ను నియమించగా దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సబ్యసాచి ఘోష్కు ఆ శాఖలోనే మరికొన్ని అదనపు బాధ్యతలను కేటాయించగా అదే శాఖకు జాయింట్ సెక్రటరీగా కాత్యాయనీ దేవిని నియమించారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కె.చంద్రకళను, తెలంగాణ రెడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీని నియమించారు. ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీగా గంగాధర్కు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా టి.వెంకన్నను నియమించారు. కీలకమైన టూరిజం డైరెక్టర్గా కె.విద్యాసాగర్ను నియమించారు. కాగా, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్గా ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రికి అడ్వైజర్/ఎక్స్-ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం. 912 జారీ చేసింది. పరిపాలనలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని వినియోగించుకునేందుకు రిటైర్మెంట్ రోజే ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





