– ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించాల్సిందే
– కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూలు చేసే కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను, వసతులను ఖచ్చితంగా పాటించాలన్నారు. గతంలో విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికల ఆధారంగా కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై విజయశాంతి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను గౌరవించి వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఫీజుల బకాయిల కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారి విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సద్వినియోగం అయ్యేలా, అర్హులైన విద్యార్థులకు తగిన న్యాయం జరిగేలా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ మెరుగైన వసతులతో కూడిన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





