భూటాన్, మాల్దీవ్స్ లాంటి సార్క్ దేశాలతో పోల్చితే భారత ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్ చాలా తక్కువగా ఉంటున్నదని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన నివేదిక స్పష్టం చేస్తున్నది. దీనికి తోడుగా గత విద్యా సంవత్సరాలతో పోల్చితే 2023 – 24లో ఐఐటిలో బి టెక్ చేసిన విద్యార్థినీవిద్యార్థుల ప్రాంగణ నియామకాలు 10 శాతం వరకు తగ్గాయనే ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా వెల్లడించడం విశ్మయాన్ని కలిగిస్తున్నది. 2021- 22లో భూటాన్లో విద్యకు 7.47 శాతం నిధులు, మాల్దీవుల్లో 4.67 శాతం కేటాయించగా భారత ప్రభుత్వ విద్య కేటాయింపులు 4.12 శాతం మాత్రమే ఉండడం గమనించారు. నూతన విద్య విధానం-2020 అమలు సజావుగా, సత్ఫలితాల దిశగా పయనించడానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని కూడా సిఫార్సు చేయడం సముచితంగా ఉన్నది.
ఐఐటి, ఐఐఐటి, ఎన్ఐటిల్లో తగ్గిన ప్రాంగణ నియామకాలు:
ఐఐఎం ప్రాంగణ నియామకాల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ప్రతిష్టాత్మక ఐఐటి, ఐఐఐటి సంస్థల్లో 2021 – 22తో పోల్చితే 2023 – 24లో ప్రాంగణ నియామకాలు 10 శాతం వరకు తగ్గాయని కమిటీ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్త 23 ఐఐటీల్లో ఐఐటి-వారణాసి మినహ (2021-22లో 83.15 శాతం నుంచి 2023-24లో 88.04 శాతానికి పెరగడం గమనించారు) మిగిలిన 22 ఐఐటీల్లో బి టెక్ పూర్తి చేసిన యువత క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గడం కొంత కలవరానికి కారణం అవుతున్నది. ఐఐటీ – మద్రాస్లో 2021-22లో 85.71 శాతం నుంచి 2023-24లో 73.29 శాతానికి తగ్గడం గమనించారు. అదే విధంగా ఐఐటి-బాంబేలో 96.11 శాతం నుంచి 83.39 శాతానికి, ఐఐటి – కాన్పూర్లో 93.63 శాతం నుంచి 82.48 శాతానికి, ఐఐటి-ఢిల్లీలో 87.69 శాతం నుంచి 72.81 శాతానికి, ఐఐటి-గౌహతిలో 89.77 శాతం నుంచి 79.10 శాతానికి, ఐఐటి-రూర్కీలో 98.54 శాతం నుంచి 79.66 శాతానికి, ఐఐటీ – హైదరాబాద్?లో 86.52 శాతం నుంచి 69.33 శాతానికి, ఐఐటి-ధార్వాడ్లో 90.20 శాతం నుంచి 65.56 శాతానికి, ఐఐటి-జమ్మూలో 92.08 శాతం నుంచి 70.25 శాతానికి ప్రాంగణ నియామకాలు తగ్గడం గమనించారు.
ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడానికి కారణాలు:
ఐఐటి, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడానికి యువత ఉన్నత విద్యకు మెగ్గు చూపడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారడం, జాబ్ మార్కెట్లో వచ్చిన మార్పులు, ఆధునిక నాణ్యమైన బోధనల్లో కొంత అలసత్వం లాంటివి ముఖ్య కారణాలుగా చెప్పబడ్డాయి. అదే విధంగా ఎంఎన్సిలు ప్రాంగణ నియామకాల్లో అందించే వార్షిక వేతనాలు లేదా ప్యాకేజీల్లో కోతలు కూడా గమనించబడినవి. ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యాబోధనల్లో సకారాత్మక మార్పులు రావాలని, అధ్యాపకులకు దశల వారీగా ఆధునిక టెక్నాలజీ రంగాల్లో శిక్షణలు ఇవ్వాలని, క్యాంపస్-పరిశ్రమల ధ్య అంతరాలను చెరిపి వేయాలని కూడా స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేయడం సముచితంగా ఉన్నది. ఎన్ఐటీల్లో వార్షిక వేతనాల ప్యాకేజీల సగటు కనిష్ఠంగా ?5 లక్షల నుంచి అత్యధికంగా ?15 లక్షల వరకు మాత్రమే అందించడం విచారకరం.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు:
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం-2020 అమలుకు సిద్ధంగా లేకపోవటంతో సర్వశిక్ష అభియాన్, పిఎం శ్రీ పథకాలకు దూరంగా ఉన్నాయనే కారణాలతో ఆయా రాష్ట్రాలకు విద్యా నిధుల విడుదలను ఆపి వేయడం జరిగిందని, ఇది మంచి పరిణామం కాదని కూడా కమిటీ అభిప్రాయపడింది. తమిళనాడుకు చెందిన దాదాపు 2,152 ?1,000 కోట్లు, కేరళకు చెందిన ?1,000 కోట్లు, పశ్చిమ బెంగాల్కు చెందిన ? 860 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని తేలింది.దేశం గర్వించదగిన అంతర్జాతీయ స్థాయి ఐఐటీల్లో సహితం ప్రాంగణ నియామకాలు తగ్గడం అనే అంశాన్ని తేలికగా తీసుకోకుండా సత్వరమే యువతలో అత్యాధునిక నైపుణ్యాల శిక్షణలు అమలు చేయడం మాత్రమే ఏకైక మార్గమని కమిటీ అభిప్రాయపడుతూ ఐఐటీలకు సూచనలు చేసింది. రానున్న రోజుల్లో ఐఐటీల్లో దాదాపు 100 శాతం వరకు ప్రాంగణ నియామకాలు సుసాధ్యం కావాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐఐటీ యాజమాన్యాలు కూడా వడి వడిగా అడుగులు వేయాలని కోరుకుందాం.
డా।। బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037