- హైబ్రిడ్ అన్యూటీ మోడ్ లోనే నిర్మించాలి
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. మండలం నుంచి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మిస్సింగ్ లింక్ రోడ్ల, అప్ గ్రేడేషన్ వంటి మూడు విభాగాలుగా నిర్మాణం చేయాలని హ్యామ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి, డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంచిగా ఉన్న రోడ్లను హ్యామ్ లోకి తీసుకొస్తే కన్సల్టెంట్లే బాగుపడుతారు కాబట్టి, అధికారులు హ్యామ్ రోడ్లను గుర్తించే క్రమంలో.. అత్యంత దారుణంగా ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రోడ్ల నిర్మాణంలో డివైడర్లు, లైంటింగ్, రోడ్డు విస్తరణ, పేవ్ డ్ షోల్డర్స్ ఏర్పాటులో ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించేలా పకడ్భందీగా వ్యవహరించాలని తేల్చిచెప్పారు.
15 ఏండ్ల పాటు హ్యామ్ రోడ్డు తీసుకున్న సంస్థే పూర్తిగా మొయింటినెన్స్ చేయాల్సి ఉన్నందున రోడ్డు నాణ్యతలో రాజీ పడకుండా ఉండేలా ప్రతీ ఇంజనీర్ జాగ్రత్తగా పనులను తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు మట్టి రోడ్డుగా ఉన్న రోడ్లను గుర్తిస్తే.. తన దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరు చేస్తానని తెలిపారు. అటవీ అనుమతులతో మట్టిరోడ్లుగా ఉన్న రహదారులను భవిష్యత్ లో బీటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజాధనంతో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో ఎక్కడా రాజీ లేదని.. నాణ్యతలేని పనులు చేస్తే వెంటనే పనులను రద్ధు చేస్తామని హెచ్చరించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సమయం కావాలని అడిగిన కన్సల్టెంట్ల అభిప్రాయాలను మంత్రి తోసిపుచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సంవత్సరం సమయం తీసుకుంటే ప్రమాదాల్లో చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని మంత్రి నిలదీశారు. ఏ రోడ్డు నిర్మాణమైనా రెండు, మూడు నెలల్లో ప్రారంభించేలా వేగంగా ముందుకు వెళ్లాలన్నారు. హ్యామ్ రోడ్ల మంజూరు రాష్ట్ర పరిధిలోనే ఉన్నందును ఆర్ & బీ డిపార్ట్ మెంట్ వేగంగా అనుమతులు మంజూరు చేస్తుందని.. కాబట్టి వెంటనే సర్వే, టెండర్ పూర్వ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయలను తీసుకోని ఎస్ఈ, ఈఈ తో పాటు ఇతర అధికారులను కలుపుకొని హ్యామ్ రోడ్ల ను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.
దశాబ్ధ కాలంగా మరమ్మతులకు నోచుకోని రహదారులను తక్షణమే ఎస్టిమేట్స్ సిద్ధం చేసి షార్ట్ టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. 82 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు గుర్తించిన 1,690.26 కిలోమీటర్ల రోడ్ల రిపేర్ల పనులను వెంటనే ప్రారంభించేలా టెండర్ పూర్వప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మార్గనిర్ధేశం చేశారు. సర్వీస్ రూల్స్ ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే ఏఈఈ లను డీఈఈలుగా ప్రమోషన్లు ఇచ్చామని, ఈ నెలాఖరుకల్లా డీఈఈ, ఈఈ, ఎస్ఈ లకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా కసరత్తు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, సీఈ (అడ్మిన్) తిరుమల, సీఈ (స్టేట్ రోడ్స్) మోహన్ నాయక్, వివిధ జిల్లాల ఎస్ఈ లు, ఈఈ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.