ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… !

తమను తాము పరిపాలించుకున్న భావన ప్రజల్లో రావాలంటే, వారి ఆలోచనలు, ఆకాంక్షలు నిజం కావాలంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వారే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎపుడూ ప్రజల సంక్షేమానికి పాటు పడే సమర్ధులైన నేతలు తమ ప్రతినిధులుగా ఎన్నికైనపుడు ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు. అపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద సజావుగా నడవాలంటే సరైన నాయకులు దేశాన్ని నడిపించాలి.  చట్టసభలకు సత్ప్రవర్తనతో కూడిన ప్రజాసేవకులే ఎన్నిక కావాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. అయితే, నేడు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. గెలవడం కోసం ఎన్ని తప్పులు చేస్తున్నారో గెలిచిన తర్వాత కూడా తమ అనుయాయుల కోసం అన్నే  తప్పులు చేస్తున్నారు. చివరికి వారు అక్రమార్కులుగా, అవినీతి పరులుగా, నేరస్థులుగా నిలుస్తున్నారు. ఈ మాట రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని సాధారణీకరించింది కాకపోయినా, 75 శాతానికి పైగా నేతలు ఎదో ఒక రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఉంటున్నారు. వారే గెలుస్తున్నారు, చివరికి తమపై ఉన్న కేసులు ముందుకు సాగకుండా వారే అడ్డుపడుతున్నారు. కొన్ని దశాబ్దాలు ఇలాగే కొనసాగినా, ప్రస్తుతం పరిస్థితి మారుతోంది.

నేతలు ప్రజల కళ్లుగప్పి చేస్తున్న తప్పుడు పనుల అంతు చూసేందుకు న్యాయస్థానాలు కళ్లు తెరిచి అనేక తీర్పులు ఇచ్చినా, రాజకీయ వ్యవస్థ వాటిని గోప్యంగానే ఉంచుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని నేతల కేసులపై ఏం చేశారని నిలదీసింది. ముందుగా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులపై దస్త్రాలు సిద్ధం అయ్యాయి. తర్వాతి దశలో చిట్టచివరి పంచాయితీ వార్డు సభ్యుడి వరకూ ఉన్న కేసుల అంతు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. తద్వారా రాజకీయ ప్రక్షాళనకు ఊతం ఇచ్చినట్టవుతుంది.  ప్రజా ప్రతినిధులపై కేసులను విచారించినపుడు జీవిత ఖైదు, లేదా మరణశిక్షకు అవకాశం ఉన్న నేరాలకు సంబంధించిన కేసులను ప్రత్యేక కోర్టుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు  సూచించింది.  పదవిలో ఉన్న, మాజీ ప్రజాప్రతినిధులపై అపరిష్కృతంగా ఉన్న క్రిమినల్‌ కేసులకు సంబంధించిన సమగ్ర గణాంక సమాచారాన్ని అందించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, డీజీపీలను, హైకోర్టులను ఆదేశించింది. అమికస్‌ క్యూరీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మాజీలైన ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,122 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.

కొన్ని కేసులైతే దాదాపు మూడు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నట్టు తేలింది. 2,324 కేసులు ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదు కాగా, 1,675 కేసులు మాజీ ప్రజాప్రతినిధులపై నమోదయ్యాయి. 1991 కేసుల్లో అభియోగాలు ఖరారు కాలేదు. 264 కేసుల్లో ‘స్టే’ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 724 జిల్లాలకుగాను 440 జిల్లాల్లో కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయి. 505 కేసులు సెషన్స్‌ కోర్టుల్లో ఉండగా, 1,928 కేసులు మెజిస్ట్రేట్‌ కోర్టుల్లోను, 33 కేసులు స్పెషల్‌ కోర్టుల్లో ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పెషల్‌ కోర్టులకు 1650 కేసులు బదిలీ అయ్యాయి.

 

ఇందులో అత్యధికంగా 992 కేసులు యూపీ రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 168 కేసులు మధ్యప్రదేశ్‌లో నమోదైనవే. చాలా కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నిందితులుగా ఉన్నారు. పరువునష్టం, మోసం కేసులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చాలా కేసుల్లో అభియోగాలు నమోదుకాకపోవడం వల్ల కేసులు పెండిరగ్‌లో ఉండగా, మరికొన్ని కేసుల్లో ఎలాంటి విచారణ కూడా జరగలేదు.  ఇలాంటి కేసుల విచారణకు సెషన్స్‌, మెజిస్ట్రేట్‌ స్థాయిలో ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయాలి. ప్రతి కేసును రోజువారీ విచారణ జరిపించాలి. అందుకు వీలుగా ఒక క్యాలండర్‌ను రూపొందించాలి. మరీ ముఖ్యమైన కారణం ఉంటే తప్ప వాయిదాలు వేయకుండా కేసు విచారణను సత్వరం పూర్తి చేయాలి.

 

మరో పక్క జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉన్న కేసులకు తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలి. మాజీ నేతలపై నమోదైన కేసుల్లో కఠిన శిక్ష, ఐదేళ్ల కన్నా ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉన్న కేసులను ముందుగా చేపట్టాలి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న ఇతరత్రా కేసులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. జీవితకాలం శిక్షపడే ఆరోపణలున్న కేసులు, కఠిన శిక్ష లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉన్న కేసులు ప్రస్తుత ఎంపీలపై ఎన్ని ఉన్నాయో విశ్లేషించుకోవాలి.  పలు కేసుల్లో ఒకే నాయకుడు ఉన్నట్టయితే వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టు నెలవారీ హైకోర్టుకు నివేదికలను సమర్పించాలి. హైకోర్టు వాటిని ప్రత్యేక పరిశీలన చేసి ఎప్పటికపుడు తగిన సూచనలు చేయాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ప్రత్యేక కోర్టులు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 294ను అనుసరించాలి.

 

ప్రమాణ పత్రంలోని ఆధారాల కోసం ప్రత్యేక కోర్టులు సీఆర్‌పీసీలోని 296ను అనుసరించాలి. ప్రత్యేక కోర్టులు విచారిస్తున్న కేసులకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు తమ నివేదికలను త్వరత్వరగా అందించాలి. గరిష్ట సమయం నెల రోజులుగా పెట్టుకోవాలి. జిల్లా సెషన్స్‌ న్యాయ మూర్తులను సంప్రదించి ప్రత్యేక కోర్టుల్లో ఇద్దరు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నియమించాలి. చాలా కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కింది కోర్టుల్లో విచారణ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఆ ఉత్తర్వులపై ‘స్టే’ మూడు నెలలకు మించకుండా హైకోర్టులు వాటిని సమీక్షించాలి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నెలకొంది. మన ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే  ఇవన్నీ తుడిచిపెట్టుకు పోవాల్సిందే…
-రేగటి నాగరాజు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *