2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం

పీఎం గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌
కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ అక్టోబర్‌ 9: ‌ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం  నిర్ణయించింది. గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పథకాన్ని 2028 డిసెంబర్‌ ‌వరకు పొడిగించారు. అంటే అప్పటి వరకూ పేదలకు ఉచితంగా ఫోర్టిఫైడ్‌ ‌బియ్యం సరఫరా చేస్తారు. దిల్లీలో బుధవారం  సమావేశమైన కేంద్ర కేబినేట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేంద్రం వంద శాతం నిధులతో పోషకాహారం అందించేందుకు వీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజనతోపాటు సంబంధిత పథకాలను కేంద్రం పొడిగించింది. 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటి కోసం రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

లోథాల్‌లో ’నేషనల్‌ ‌మారిటైమ్‌ ‌హెరిటేజ్‌ ‌కాంప్లెక్స్’ అభివృద్ధికి కేబినెట్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. రాజస్థాన్‌, ‌పంజాబ్‌ ‌సరిహద్దుల్లో రూ.4,406 కోట్లతో 2280 కి. మేర రోడ్ల నిర్మాణానికి అంగీకరించింది. దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి పోషణ్‌ అనే పథకం అమల్లో ఉంది. సాధారణ బియ్యంలో పోషకాలను జోడిస్తే  ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ అవుతుంది. పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు, సప్లిమెంట్లు కలపడాన్నే ఫోర్టిఫైడ్‌  ‌రైస్‌గా చెప్పుకోవచ్చు. ఆహారాన్ని బలవర్థకం చేయడమే దీని లక్ష్యం. బియ్యం, ఇతర ఆహార ధాన్యాలలో ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌కెన్నెల్స్ ‌కలిపి సరఫరా చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారిస్తామని కేంద్రం ఇప్పటికే తెలిపింది. కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్‌, ‌జింక్‌, ‌ఫోలిక్‌ ‌యాసిడ్‌, ‌విటమిన్‌ ‌బి-12 వంటి విటమిన్లు, పోషకాలను కలిపి అనంతరం ఆ పిండిని కెన్నెల్స్‌గా  మార్చేస్తారు.  ఇలా తయారు చేసే పరిశ్రమలు దేశవ్యాప్తంగా పరిమితంగా ఉన్నాయి.   ఆయా పరిశ్రమల నుంచి మిల్లర్లకు కేంద్రం ఈ ఫోర్టిపైడ్‌ ‌రైస్‌ ‌కెన్నెల్స్ ‌సరఫరా చేస్తుంది. ప్రతి క్వింటాలు బియ్యానికి 1 కిలో ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌కెన్నెల్స్ ‌కలిసేలా ఇప్పటికే ప్రత్యేక యంత్రాలు కూడా ఉన్నాయి. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ప్రజాపంపిణీ బియ్యం.. ఇలా దశలవారీగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా బలవర్థక ఆహారం సరఫరా చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది.  రాజస్థాన్‌, ‌పంజాబ్‌ ‌దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.4,406కోట్లు కేటాయించారు.  2,208 కిలోటర్ల రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ పెంచుతారు. హైవేతో అనుసంధానం చేయడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *