- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
- ఏడుగురు మావోయిస్టులు మృతి
- అబూజ్మడ్లో భద్రతాబలగాల కూంబింగ్
- భారీగా ఆయుధాల స్వాధీనం
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోసారి తుపాలకు మోతతో దద్దరిల్లింది. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు భీకర కాల్పులతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజి సుందర్రాజు వెల్లడించారు.
మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే పక్కా సమాచారంతో నారాయణపూర్, దంతెవాడ, కొండగాల్, జగ్దల్పూర్ జిల్లాల భద్రత బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల సమావేశం ప్రాంతానికి చేరుకున్నారు. భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో ప్రతిఘటించిన డిఆర్జి, ఎస్టిఎఫ్, సిఆర్పిఎఫ్, భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. సంఘటన స్థలం వద్ద భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. మరికొంత మంది మావోయిస్టులు మృతి చెందారనే అనుమానంతో అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పనిలో పోలీస్ అధికారులు ఉన్నారు.
కాగా గత వారం రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో ఏటూరునాగారం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఆరుగురు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలిచాలనే ఉద్దేశంతో ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలను, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో ప్రత్యేక సూచనలు చేసింది. ఈ సూచనలతో భాగంగా ప్రత్యేక బలగాలను అటవీ ప్రాంతంలోకి పంపించారు. ఇప్పటివరకు సుమారు 290 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. చత్తీస్గఢ్ రాష్ట్రం అటవీ ప్రాంతంలో భద్రత బలగాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మావోయిస్టులు సేఫ్ జోన్ కోసం అన్వేషనలో పడినట్లు సమాచారం. సమీపంలో ఉన్న తెలంగాణలోకి ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రవేశించినట్లు తెలుస్తుంది. అందుకోసమే ఇటీవల కాలంలో తెలంగాణ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. తెలంగాణలోని అగ్రనాయకులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక్కసారిగా ఏడుగురు మృత్యువాత పడటం మావోయిస్టులకు భారీ నష్టంగా పరిగణించవచ్చు.