హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మనమంతా కలిసి తెలంగాణ మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత గల భవిష్యత్తును నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘పింక్ పవర్ రన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పక్షి అకృతిలో ఏర్పాటు చేసిన అతిపెద్ద మానవహారం అందరినీ ఆకట్టుకుంది. ఈసందర్భంగా వలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు వైద్యులు, సుధా రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.





