ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ ‌రావు, శ్రవణ్‌ ‌రావులను హాజరు పర్చండి
నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 20 : ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్‌ ‌రావు (ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌), ఏ6 ‌శ్రవణ్‌ ‌రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టుఆదేశాలు జారీసింది. ఇప్పటికే ప్రభాకర్‌ ‌రావుపైన కోర్టు నాన్‌బెయిలబుల్‌ ‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. అయితే ప్రభాకర్‌ ‌రావు విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇంటర్‌ ‌పోల్‌ ‌ద్వారా ప్రభాకర్‌ ‌రావు, శ్రవణ్‌ ‌రావులను పోలీసులు ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్‌ ‌రావు ఉన్నట్లు సిట్‌ ‌బృందం గుర్తించింది. శ్రవణరావు ఆచూకీని మాత్రం దర్యాప్తు బృందం ఇప్పటికీ కనుకోలేకపోయినట్లు తెలుస్తోంది.

కాగా… ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌ ‌రావు కనుసన్నల్లోనే ఫోన్‌ ‌టాపింగ్‌ ‌జరిగిందని పోలీసులు నిర్దారించారు. ఫోన్‌ ‌టాపింగ్‌ ‌వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్‌ ‌రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్‌ ‌రావు ఆచూకీ కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ ‌నోటీసులు జారీ చేశారు. లుక్‌ అవుట్‌ ‌నోటీసులకు స్పందన లేకపోవడంతో.. రెడ్‌ ‌కార్నర్‌ ‌నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రణీత్‌ ‌రావు ఏ2గా, తిరుపతన్న ఏ3గా, భుజంగరావు ఏ4గా, రాధాకిషన్‌ ‌రావు ఏ5గా ఉన్నారు. ఈ నలుగురు ఇటీవల దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్‌ ‌పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్‌ ‌కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

లాగే ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలులో ఉన్న టాస్క్ ‌ఫోర్స్ ‌మాజీ డీసీపీ రాధాకిషన్‌ ‌రావుపై మరో కేసు నమోదు అయ్యింది. నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై పోలీసులు రిమాండ్‌ ‌చేశారు. యజమానిని కిడ్నాప్‌ ‌చేసి క్రియా హెల్త్ ‌కేర్‌ ‌సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల దకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్‌ ‌ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో రాధాకిషన్‌రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్‌, ‌కృష్ణ, గోపాల్‌, ‌రాజ్‌, ‌రవి, బాలాజీలపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ ‌నోటీస్‌ ‌జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *