తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ అధికారంలోకి వద్దాం..
రాష్ట్రంలో బీఆరెస్ మాదిరిగానే కేంద్రంలో బీజేపీని బొందపెట్టాలి..
చర్లపల్లి జైలులో కేసీఆర్ కు చిప్పకూడు ఖాయం..
తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: తెలంగాణలో కార్యకర్తల శ్రమ, కష్టం, మీ త్యాగంతోనే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరదని తెలంగాణ స్పూర్తితోనే కేంద్రంలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియమ్మ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన గడ్డపైనే రాహుల్ గాంధీ దేశానికి ఐదు గ్యారంటీలు ప్రకటించారని హర్షం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణంలో మిమ్మల్ని చూస్తోంటే ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది ఒకేసారి పోటెత్తినట్లుందని అన్నారు.
మీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరది.. గుజరాత్ మోడల్ పై వైబ్రాంట్ తెలంగాణ మోడల్ ఆధిపత్య చూపడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమని అన్నారు. దేశ ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలని రేవంత్ ప్రశ్నించారు. 20కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 7 లక్షల 20వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? 750 రైతులను చంపినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మోదీ.. తెలంగాణలో ఎంత మందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారతం,ఉత్తర భారతం మధ్య చిచ్చు పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
గతంలో హైదరాబాద్ వరదల్లో మునిగితే సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆరెస్ ను బొందపెట్టినట్టే.. కేంద్రంలో బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. భాష గురించి, భావం గురించి నిన్న మొన్న కొన్ని నక్కలు మాట్లాడుతున్నాయని, పదేళ్లు దోపిడీ దొంగల్లా.. అడవి పందుల్లా దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడుతున్నారని మా కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే మీ ఒంటిమీద అంగీ లాగు కూడా మిగలదని హెచ్చరించారు. కాలు విరిగిందని, కూతరు జైలుకు వెళ్లిందని కొంత కాలం మేం సంయమనం పాటించామని, కానీ మీరేం చేసినా మేం ఊరుకుంటామనుకోవద్దన్నారు. చూస్తూ ఊరుకోవడానికి నేను పెద్దలు జానా రెడ్డిని కాదని తాను రేవంత్ రెడ్డినని, మీకు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపించడం ఖాయమని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టించి తీరుతామన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిన చోట మీరు ఓట్లు అడగండి… ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట మేం ఓట్లు అడుగుతాం.. మీకు డిపాజిట్లు వస్తాయో లేదో చూద్దామని సవాల్ విసిరారు. వంద రోజుల్లో మేం మంచి పరిపాలన అందించామని తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలు గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం అభివృద్ధికి భవిష్యత్ తో నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పారు. గంటకో డ్రస్ మార్చే మోదీ కావాలో.. ప్రజల కోసం దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో ఈడీ, ఐటీ, సీబీఐ ల మోదీ కుటుంబం గెలుస్తుందో.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం గెలుస్తుందో చూద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.