– డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణ
– ఎన్నికల సంఘం ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రాష్ట్ర శాసనమండలిలోని మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ ఖాళీలు 2027 మార్చి నాటికి ఏర్పడతాయని, వీటిని ద్వైవార్షిక ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అందువల్ల, ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి 2026 నవంబర్ 1ని అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని, ఓటర్ల జాబితాలను కొత్తగా రూపొందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ఓటర్ల నమోదుకు సంబంధించి నోటీసును ఈనెల 28న జారీ చేస్తారు. తర్వాత అక్టోబర్ 15న వీటిని తొలిసారి, 25న రెండవసారి ప్రచురిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 6 కాగా, ఓటర్ల జాబితాను 20నాటికి తయారు చేస్తారు. నవంబర్ 25న ఓటర్ల ముసాయిదానను ప్రచురిస్తారు. డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 30న ప్రచురిస్తారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గంలో నమోదు కోరుతూ సవరించిన ఫారం-18లో సమర్పించే ప్రతి దరఖాస్తుతోపాటు అవసరమైన పత్రాలు/ధ్రువీకరణ పత్రాల కాపీలను జత చేయాలని ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. దరఖాస్తులను సీఈఓ వెబ్సైట్ https://ceotelangana.nic.in ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు లేదా అవసరమైన పత్రాలు/ధ్రువీకరణ పత్రాలతో కూడిన ‘ఫారం-18’ ను ఈఆర్ ఓలు/ఏఈఆర్ ఓటు/నిర్దేశిత అధికారులు/అదనపు నిర్దేశిత అధికారులకు స్వయంగా సమర్పించవచ్చు. అలాగే, ఈ దరఖాస్తులను పోస్ట్ ద్వారా కూడా ఎన్నికల నమోదు అధికారి/సహాయ ఎన్నికల నమోదు అధికారి / నిర్దేశిత అధికారికి పంపవచ్చునని ఎన్నికల అధికార కార్యాలయం పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు