యువశక్తితో ఎన్నో అద్భుతాలు..

  • విక‌సిత్ భార‌త్ వైపు ప‌రుగులు
  • రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

భారతదేశంలోని యువత అత్యంత శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంద‌ని, యువత మేధస్సుతో భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తోంద‌ని,  భవిష్యత్తులో మరింత శక్తితో అద్భుతాలు సాధించ‌వ‌చ్చ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ రోజ్‌గార్ మేలాలో భాగంగా 180 మంది యువతీ యువకులకు కిష‌న్ రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  గత పదేళ్లుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామ‌ని, పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, డాక్టర్లు, ఐటీ కంపెనీల్లో భారతీయులే ఉన్నారని తెలిపారు.  ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ యువత ఉన్నారని,   రానున్న రోజుల్లో దేశ అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం యువశక్తిని అపారంగా వినియోగించుకోవాల‌న్నారు. వందేళ్ల స్వాతంత్ర్య భారతానికి (2047 వరకు) అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ  పని చేస్తున్నారని తెలిపారు.

 

వికసిత్ భారత్ గా తీర్చిదిద్దుకునే క్రమంలో అన్ని రకాల శక్తి సామర్థ్యాలను సమకూర్చుకోవాల‌ని,  33సంవత్సరాల తర్వాత దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింద‌ని,  దేశంలో 3లక్షల మంది సలహాలు, సూచనలు తీసుకొని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త కస్తూరి రంగన్ నేతృత్వంలో కొత్త కమిటీ వేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని వివ‌రించారు.  సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి తీసుకొచ్చింది. 75 దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ దేశాలతో పోటీపడే దేశీయ టెక్నాలజీతో కూడిన వందేభారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాం. డిఫెన్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిఫెన్స్ లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళాశక్తిని ముందు పెట్టి దేశ అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యులు చేస్తున్నాం. దేశం అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు చాలా అవసరం. జీరో టాలరెన్స్ తో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం.

జమ్మూ కశ్మీర్ లోని ఒక జిల్లాలో తప్పితే దేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ మూలాలను ఉక్కుపాదంతో అణచివేశాం. ప్రస్తుతం దేశంలో కరెంటు కోతలు లేవు. నరేంద్రమోదీ  నాయకత్వంలో పేదవాడి ఇంట్లో టాయిలెట్ల నుండి చంద్రయాన్ వరకు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. వచ్చే 25సంవత్సరాలు యువశక్తిని అపారంగా వినయోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జన్మించిన గ్రామాన్ని, మాతృభాషను మరవొద్దు. ప్రతీ ఒక్కరు నేషన్ ఫస్ట్ అనే నినాదంతో పని చేయాలి. నరేంద్రమోదీ గారి నాయకత్వంలో గ్రామాల్లోని పోస్ట్ ఆఫీస్ లను బ్యాంకులుగా తయారు చేసుకున్నాం. గత పది సంవత్సరాలుగా మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. బార్డర్ లో సైనికులతో దీపావళి జరుపుకోవాలని చెప్పారు. చిన్న ఉద్యోగమని అనుకోకుండా ప్రతీఒక్కరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *