మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 : నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు చేశారు. రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. మసీదులు, ముస్లింల గృహాల్లో సందడి నెలకొంది. ముస్లింల ముఖాల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి.
ఆదివారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. సామూహిక ప్రార్థల దృష్ట్యా మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. షామియానాలు, టెంట్లు, కార్పెట్లు, సౌండ్ సిస్టంలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రార్థనల సమయంలో పోలీసులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు.