అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

  • ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు
  • సీఎం రేవంత్‌రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వస్తే అర్థమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఒక్క పాలసీ తేలేదన్నారు. తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవ్వరూ చేయలేదని పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి నాటి నుంచి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకి తెచ్చినట్లు వెల్లడించారు. పన్ను వసూళ్లలోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందంటూ రేవంత్‌ తెలిపారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే, టన్నెల్‌లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచికానందం పొందుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదంటూ సీఎం రేవంత్‌ అన్నారు. తానెవరో తెలీకుండానే పీసీసీ, ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారా? అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో తనకు విబేధాలు వొచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు రేవంత్‌. తెలంగాణ సీఎంగా ఉన్నా కాబట్టే రాష్ట్రంలో తనను ప్రశ్నిస్తున్నారని, అలాగే కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ఉన్నారు కాబట్టే ఆయన్నీ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ప్రశ్నిస్తున్నారని అన్నారు. మిగతా రాష్ట్రాల కేంద్రమంత్రులు వారివారి రాష్ట్రాలకు కావాల్సినవన్నీ సాధించుకుంటున్నారని, కానీ కిషన్‌ రెడ్డి మాత్రం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను ఆరు గ్యారెంటీలు అడగడం లేదని, తెలంగాణకు ప్రధాని ప్రకటించిన రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో, మూసీ, కేంద్ర ప్రాజెక్టులు మాత్రమే అడుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. మెట్రోకి క్యాబినెట్‌ అనుమతి వస్తే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. హైదారాబాద్‌ గేమ్‌ ఛేంజర్‌ మెట్రో అంటూ రేవంత్‌ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *