కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు!

దుబాయ్‌లా భారత్‌లో టాక్స్‌ ఫ్రీ స్టేట్‌ !
సిక్కింకు టాక్స్‌ పేమెంట్స్‌  నుంచి మినహాయింపు

పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా  మార్పులు చేయలేదు. అయితే  కొత్త పన్ను విధానంలో మాత్రం.. కీలక మార్పులు చేస్తోంది. ఇటీవల స్టాండర్డ్‌ డిడక్షన్‌ కూడా పెంచింది. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్ని కూడా సవరించింది. మరింత సరళీకృతం చేసింది. దీంతో మధ్య తరగతి ప్రజలకు, మధ్య ఆదాయ వర్గానికి ఉపశమనం కలిగింది. మన దేశంలో నిర్దిష్ట పరిమితికి మించి సంపాదించే డబ్బుపై ప్రభుత్వానికి ఇన్‌కంటాక్స్‌ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఎంత ఆదాయంపై టాక్స్‌ ఎంత కట్టాలి అనేది .. ఆయా టాక్స్‌ శ్లాబులపై ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో.. కొన్ని టాక్స్‌ సేవింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్లతో పన్ను మినహాయింపులు పొందొచ్చు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ముందు వరుసలో ఉన్న దుబాయ్‌లో టాక్స్‌ ఉండదన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో కూడా ఇలాంటి ఒక రాష్ట్రం ఉంది. సిక్కిం రాష్ట్ర ప్రజలు.. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టాల్సిన పని లేదు. వీరికి టాక్స్‌ పేమెంట్స్‌ నుంచి మినహాయింపు ఉంది. మన దేశంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. భారత్‌లో 22వ రాష్ట్రంగా గతంలో విలీనమైంది.

1975లో ప్రత్యేకంగా ఒక రెఫరెండం నిర్వహించి మరీ సిక్కింను దేశంలో విలీనం చేశారు. అప్పుడే సిక్కింను పరిపాలిస్తున్న రాజు.. విలీనం కోసం ఒక షరతు పెట్టారు. ఇప్పటివరకు అంటే 1975కు ముందు పన్ను చెల్లింపుల్లో తాము ఎలాంటి చట్టాలు, నిబంధనలు పాటిస్తున్నామో.. విలీనం అయిన తర్వాత కూడా అలాగే ఉండాలని సూచించారు. అంటే.. ఒక ప్రత్యేక హోదా కిందే దేశంలో విలీనానికి ఒప్పుకుంది. 1975కు ముందు నుంచే సిక్కిం.. తమ సొంత పన్ను చట్టం 1948 అనుసరిస్తూ వస్తుంది. దీని ప్రకారమే కేంద్రానికి వీరు పన్ను చెల్లించరు. 2008లో మాత్రం కేంద్రం.. సిక్కింలో ఉన్న ఇన్‌కంటాక్స్‌ యాక్ట్‌ను రద్దు చేసింది.

రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్టికల్‌ 371 (ఎఫ్‌) విధించింది. టాక్స్‌ పేమెంట్స్‌ కోసం  కొత్తగా సెక్షన్‌ 10 (26 ఏఏఏ) తెచ్చింది. దీని ప్రకారం కూడా.. సిక్కింలోని 94 శాతం జనం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు  పొందుతున్నారు. ఈ సెక్షన్‌ ప్రకారం.. ఇతర ప్రాంతాల నుంచి స్వీకరించే డివిడెండ్లు, సెక్యూరిటీలపై కూడా వడ్డీల వంటి విషయంలో సిక్కిం ప్రజలు టాక్స్‌ బెనిఫిట్స్‌ పొందుతున్నారు. సిక్కింతో పాటుగా.. ఇతర ఈశాన్య రాష్ట్రాలైన  త్రిపుర, మణిపుర్‌, నాగాలాండ్‌, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్‌ తెగల ప్రజలకు కూడా పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది. సెక్షన్‌ 10(26) ప్రకారం కొన్ని ప్రత్యేక ప్రాంతాల ప్రజలకు ఈ టాక్స్‌ వర్తించదు.
-ఎం.జి.ఆర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page