“కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది. యుద్ధం ఆగకపోతే చమురు ధరలు ఇంకా ఎగబాకే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది ..”
ప్రపంచ రాజకీయాల్లో తుపాకులు పేలితే, దాని ప్రతిధ్వని భారతీయుడి వంటింట్లో వినిపించడం కొత్త విషయం కాదు. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ చెలరేగిన యుద్ధ వాతావరణం వేల కిలోమీటర్ల దూరంలో జరిగినా, దాని భారాన్ని మోయాల్సింది భారత ప్రజలే. హోర్ముజ్ జలసంధి మూతపడడం, బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 96 డాలర్లను దాటడం కేవలం అంతర్జాతీయ వార్త కాదు. అది భారత ఆర్థిక వ్యవస్థకు మరో ప్రమాద హెచ్చరిక. కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది. యుద్ధం ఆగకపోతే చమురు ధరలు ఇంకా ఎగబాకే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది .
ఇలాంటి ప్రతి సంక్షోభంలో భారతదేశం ఎందుకు ఎక్కువగా నష్టపోవాల్సి వొస్తుంది ? సమాధానం స్పష్టమే. దేశ అవసరాల్లో దాదాపు 85 శాతం ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. స్వయం సమృద్ధి గురించి ఎన్నో ప్రసంగాలు వినిపిస్తున్నా, ఇంధన భద్రత విషయంలో మాత్రం విదేశాలపై ఆధారపడుతూనే ఉన్నాం. ఫలితంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, దాని బిల్లు భారత ప్రజల జేబుకే చేరుతోంది.చమురు ధర పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మాత్రమే కాదు. రవాణా ఖర్చు పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఎరువులు, వంటనూనెలు, పారిశ్రామిక ముడిసరుకు, ఔషధ తయారీ వ్యయం పెరుగుతుంది. చివరకు ప్రతి వస్తువు ధరపై దాని ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం మళ్లీ ప్రజలపై విరుచుకుపడుతుంది. మధ్యతరగతి కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. పేద కుటుంబాల జీవనం మరింత భారమవుతుంది.
స్టాక్ మార్కెట్ల పతనం కూడా ఇదే భయాన్ని ప్రతిబింబిస్తోంది. సెన్సెక్స్ వరుసగా గత నాలుగు రోజుల పాటు పడిపోవడం యాదృచ్ఛికం కాదు. పెట్టుబడిదారులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న సంకేతం. రూపాయి బలహీనపడితే విదేశీ పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంది. పరిశ్రమల పెట్టుబడులు మందగిస్తాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. తెలంగాణకు ఈ సంక్షోభం మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఔషధ పరిశ్రమ, రసాయన పరిశ్రమ, తయారీ రంగాలు, రవాణా రంగం—ఇవన్నీ ఇంధన వ్యయంపై ఆధారపడినవే. డీజిల్ ధరలు పెరిగితే రైతు నుంచి రవాణాదారుడి వరకు ప్రతి ఒక్కరి ఖర్చు పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగినా రైతుకు లాభం రావడం కాదు; మధ్యలోని వ్యయమే పెరుగుతుంది. పట్టణాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారమవుతాయి. ఇప్పటికే జీవన వ్యయం పెరుగుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ పరిణామం మరింత ఒత్తిడిని సృష్టిస్తుంది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజల ముందు నిజాలను దాచిపెట్టకుండా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. వ్యూహాత్మక చమురు నిల్వలను ఎంత మేర ఉపయోగిస్తారు? ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పన్నుల భారాన్ని తగ్గిస్తారా? ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ఎంత వేగంగా విస్తరిస్తారు? ఇవన్నీ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపిస్తూ ధరల పెరుగుదలను ప్రజలపై పూర్తిగా మోపడం పాలన కాదు. ఈ సంక్షోభం మరో కఠినమైన సత్యాన్ని గుర్తుచేస్తోంది. రాజకీయ ప్రసంగాల్లో “ఆత్మనిర్భర్ భారత్” అనే నినాదం ఎంత వినిపించినా, ఇంధన రంగంలో నిజమైన స్వావలంబన ఇంకా చాలా దూరంలోనే ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడుతున్నంత కాలం, పశ్చిమాసియాలోని ప్రతి యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తూనే ఉంటుంది. అందుకే ఇది కేవలం చమురు సంక్షోభం కాదు. ఇది దేశ ఇంధన విధానానికి పరీక్ష. ఇది ఆర్థిక నిర్వహణకు పరీక్ష. ఇది విదేశాంగ దౌత్యానికి పరీక్ష. ముఖ్యంగా ప్రజల జీవన వ్యయాన్ని నియంత్రించడంలో ప్రభుత్వ సామర్థ్యానికి పరీక్ష. యుద్ధాన్ని ఆపే శక్తి భారతదేశానికి లేకపోవచ్చు. కానీ యుద్ధ ప్రభావాన్ని తగ్గించే ముందుచూపు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే యుద్ధం మధ్యప్రాచ్యంలో జరిగినా, దాని మంటల్లో కాలిపోయేది భారత ప్రజల ఆర్థిక భద్రతే.
-హసీనా





