‘ఆమె’ దార్శనికత అనితర సాధ్యం!

  • కొత్త దృష్టికోణం, మంచి ఆర్థిక రాబడి
  • అక్షయ ఇంధన రంగంలో మహిళల ప్రాతినిధ్యం!

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు రానున్న దశాబ్దంలో పనిచేసే వయసున్న జనాభా మన దేశంలో అందరికన్నా ఎక్కువగా అంటే 100 కోట్లకు పైగా ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది పనిచేసే జనాభాతోపాటు విద్యావంతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఒక మంచి పరిణామంగా మారి భారతదేశానికి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన శక్తిని ఇవ్వగలదు. మొత్తం సమస్య పరిష్కారానికి మహిళలు పారిశ్రామివేత్తలుగా, వ్యవస్థాపకులుగా మారడం కీలక అంశం కాగలదు. ఉపాధి కల్పన ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇవ్వడమే కాక మహిళలు సామాజికంగా.. వ్యక్తిగతంగా పరివర్తన చెందడానికి కూడా అది ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు భారతావనిలో మహిళల యాజమాన్యంలో దాదాపు 135-157 లక్షల వ్యాపార పారిశ్రామిక సంస్థలు పనిచేస్తున్నాయి. దేశంలోని మొత్తం సంస్థలలో ఇవి దాదాపు 20 శాతం. సంఖ్యానుగుణంగా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికినీ, వాస్తవంగా చూస్తే వీటిలో ఏక వ్యక్తి సంస్థలే ఎక్కువగా వున్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 22 నుంచి 27 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అంచనా. పనితీరు అధికంగా వున్న దేశాలను ప్రమాణంగా తీసుకోవడం ఇండియాలో మొత్తం మీద మహిళల వ్యవస్థాపక శక్తిని వేగిరం చేయడానికి కొలబద్ద కాగలదు.

రాశి, వాసి పరంగా వ్యవస్థాపకతను ప్రమాణాల సాధన దిశగా వేగిరం చేసినట్లయితే దేశంలో మహిళల యాజమాన్యంలో 3 కోట్లకుపైగా సంస్థల సృష్టి జరుగుతుంది. దానిలో 40 శాతం స్వయం ఉపాధితోపాటు ఇతరులకు ఉపాధి కల్పిస్తాయి. ఇది ఇండియాలో పరివర్తనను సుసాధ్యం చేసే విధంగా ఉపాధి అవకాశాలను, అంటే దాదాపు 15-17 కోట్ల ఉద్యోగాలు సృష్టించగలదు. అంటే ఇప్పటినుంచి 2030 వరకు దేశ జనాభాలో పనిచేసే వయసున్నవారికి అవసరమైన కొత్త ఉద్యోగాలలో 25 శాతంకన్నా ఎక్కువ అన్నమాట.

వాతావరాణ మార్పులను అనుసరించి ముందుకు సాగడం… దాని నుంచి ఉపశమనం పొందడానికి చర్యలు తీసుకోవడంలో మహిళా వనరులను ఉపయోగించుకోవడం ఇపుడు చాలా తక్కువ. మహిళా శక్తిని మనం సరిగా వినియోగించుకున్నట్లయితే అక్షయ ఇంధన ప్రాజెక్టులను సమర్థవంతంగా దక్షతతో నిర్వహించగలరు. తద్వారా ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడి తమతోపాటు తోటివారికి ప్రయోజనం చేకూర్చగలరు. మహిళల్లో దాగిన పూర్తి శక్తిని గుర్తించడంలో దేశాలు విఫలమైనట్లయితే దానివల్ల ఇంధన రంగంలో బహుళ ప్రయోజనాలు పొందగల అవకాశాలు చేజారిపోతాయి. విధాన రూపకల్పన చర్చలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, ఉపశమన చర్యల ద్వారా పొందే ప్రయోజనాలలో సమాన అవకాశాలు కల్పించడం, అక్షయ ఇంధన రంగాన్ని… ఇంధన సామర్థ్య శ్రామిక శక్తి పనులను మహిళలకోసం తెరవడం, ఈ రంగంలో మదుపరులుగా (ఇన్వెస్టర్లు) మహిళలకు ప్రాతినిధ్యాన్ని పెంచడం వంటి పనుల ద్వారా ఉపశమన చర్యల సామర్థ్యాన్ని పెంచడానికి … ఇంధన రంగంలో స్త్రీ-పురుష సమానత్వం సాధించానికి తోడ్పడుతుంది.

పునరుద్ధరణీయాలు దినదినాభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమలో వైవిధ్య కార్మిక శక్తిని చేర్చుకోవడం అవసరం. పునరుద్ధరణీయ పరిశ్రమ రంగంలో వైవిధ్యమైన కార్మిక శక్తి ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి వీలుగా నాయకత్వ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించాలి. కొత్త దృష్టికోణం, మంచి ఆర్థిక రాబడి, వినియోగదారులను గురించిన మంచి అవగాహన మరియు పని వాతావరణం, పరిసరాలు మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ తరుణంలో సమాన పని పరిస్థితుల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండేలా నిశ్చయపరచుకోవాలని 100 సంవత్సరాల క్రిందట మొదలెట్టిన పని మనకు మళ్లీ గుర్తుకువస్తోంది. అక్షయ ఇంధన పరిశ్రమలో మనం చేయవలసిన పని ఇంకా మనకోసం ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు ఈ పరిశ్రమలో 10 మిలియన్లకన్నా ఎక్కువమంది కార్మికులు పనిచేస్తుండగా 2050 నాటికి వారి సంఖ్య మూడింతలు కాగలదని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధి అనేది సమీకృత ప్రయోగాలను ఆచరించడంతోపాటు పరిశ్రమ సేవలు పొందుతున్న అన్ని సామాజిక వర్గాలకు కార్మిక వ్యక్తి ప్రతిబింబంగా ఉండాల్సిన అవసరం వుంది. తీవ్రంగా పోటీపడగల, నిబద్ధ, ప్రేరేపిత జట్లతో పనిచేయించడం నిస్సందేహంగా మహిళలు విభిన్న వర్గాల హక్కులు పెంపొందడానికి మాత్రమే కాక కంపెనీలు మంచి పనితీరును సాధించడానికి తోడ్పడుతుంది.

ఈ సందర్బంగా భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలలో ఆద్యులు డాక్టర్ అన్నా మణి (1918-2001) కృషికి వందనాలు చెప్పుకోవలసిందే. ఆమె ‘భారతీయ అక్షయ ఇంధనానికి మాత’ వంటిది. డాక్టర్ మణి భారతీయ భౌతిక శాస్త్రవేత్త … వాతావరణ శాస్త్రవేత్త. ఆమె భారతీయ వాతావరణ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో పనిచేశారు. ఆమె ఓజోన్‌ను కొలిచే సాధనం ‘ఓజోన్ సౌండ్’ను అభివృద్ధి చేశారు. ఈ సాధనంతో ఓజోన్ పొరను గురించి విశ్వసనీయమైన డేటాను సేకరించడం ఇండియాకు సాధ్యమైంది. ఈ రంగంలో డాక్టర్ మణి ఒంటరిగా జరిపిన కృషి ఆమె అంతర్జాతీయ ఓజోన్ కమిషన్ సభ్యురాలిగా ఎంపిక కావడానికి గుర్తింపును తెచ్చింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రం సారాభాయ్ కోర్కె మేరకు ఆమె 1963లో తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రంలో వాతావరణ వెధశాల (పరిశీలనశాల)ను… సాధన వినియోగ టవర్‌ను ఏర్పాటుచేశారు. డాక్టర్ మణి 1976లో భారతీయ వాతావరణ శాఖ నుంచి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. ఆ తరువాత రామన్ పరిశోధనా సంస్థలో మూడేళ్ళపాటు విజిటింగ్ ప్రొఫెసర్ హోదాలో పనిచేశారు. అక్కడ మానివేసిన తరువాత బెంగుళూరు దగ్గర నంది హిల్స్ వద్ద మిల్లీమీటర్ వేవ్ టెలీస్కోప్ ఏర్పాటుచేశారు.

ఆమె భారత సౌర వికిరణ సమాచార కరదీపిక (ది హ్యాండ్‌బుక్ ఫర్ సోలార్ రేడియేషన్ డేటా ఫర్ ఇండియా- 1980) , భారత్‌పై సౌర వికిరణ (1981) అని రెండు పుస్తకాలు ప్రచురించారు. అవి ఆ తరువాత సౌర సాంకేతిక ఇంజనీర్లకు ప్రామాణిక గ్రంథాలుగా మారాయి. ఆమె దార్శనికత అనితర సాధ్యం. భారత ఇంధన అవసరాలను, భవిష్యత్తులో భారత అభివృద్ధిలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల పాత్ర ఎంత గొప్పదో ఆమె ముందుగానే ఊహించారు. ఆమె దేశ వ్యాప్తంగా 700 చోట్ల ఏడాది పొడవునా అత్యంత అధునాతన సాధనాలతో గాలి వేగాన్ని కొలిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా సౌర, పవన ఇంధన సృష్టి ద్వారా ఇండియా నాయకత్వం వహించడం వెనుక డాక్టర్ మణి కృషి వున్నందున అందులో కొంత కీర్తి ఆమెకు దక్కుతుంది.

-కందుల లతా శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *