ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు.
•మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమిటి?
•8 మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా?
•రేవంత్ రెడ్డికి ఇక్కడికొచ్చి చూసే టైం లేదా?
•ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు
నాగర్కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్ఎల్బిసి టన్నెల్ లో చిక్కుపోయిన వారిని రక్షించడంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శి ంచారు. గురువారం ఆయన బాధితులను పరామర్శి ంచేందుకు సహాయక చర్యలను పరిశీలించేందుకు టన్నెల్ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు జరుగుతున్నాయనీ, కొద్ది రోజులు ఆగి వెళ్లాలని కేసీఆర్ సూచించడంతో ఇప్పటివరకు సంయమనం పాటించాం. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఆరు రోజుల్లో 8 మంది ప్రాణాలు కాపాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది సున్నా పని. బాధిత కుటుంబాలను పరామర్శించటానికి వొచ్చామని అయినా మమ్మల్ని అడ్డుకున్నారు. అయినా మేము, మా సభ్యులు పోలీసులకు సహకరించాం. వివిధ బృందాల మధ్య సమన్వయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉండడం ఏమిటి? లోపల ఉన్నవారి ప్రాణాలు ఏమైపోవాలి. ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా? మంత్రులు పొద్దున వొస్తున్నారు సాయంత్రం పోతున్నారు ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా? హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. హెలికాప్టర్లు వేసుకొని ఎన్నికల ప్రచారం పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు రాలేదు. డైరెక్షన్ లేదు. మంత్రి రోజు పొద్దున వొస్తుండు, సాయంత్రం పోతున్నాడు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో డైరెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్టు పనిచేయడం లేదు.
దాన్ని రిపేర్ చేయడానికి ఆరు రోజులు పడుతుందా. గంటల్లో పూర్తి చేసే పని. కన్వేయర్ బెల్టు పనిచేస్తే లోపల ఉన్న శిథిలాలు వంటివి బయటకు తీసుకురావడానికి సాధ్యమవుతుంది. టన్నెల్ బోర్ మెషిన్ పార్టస్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నారు. అవి కట్ చేసి, తీసుకురావాలా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు సమయం తీసుకున్నారు. వేగంగా డీ వాటరింగ్ చేసి, కన్వేయర్ బెల్ట్ సరిచేసి అడ్డంకిగా ఉన్నవి బయటికి తేవాల్సి ఉండాల్సింది. ఆరు రోజుల తర్వాత తట్టెడు మట్టి తెచ్చారు. 8 మంది ప్రాణాలు కాపాడటం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా. సహాయక బృందాలు, కంపెనీ వారు, లేబరు, అధికారులు అందరితో మాట్లాడడం.కన్వేయర్ బెల్టు ఎప్పటి వరకు అవుతుందని అడిగితే.. రెండు రోజులను ఒకరంటారు, ఉత్తమ్ కుమార్ రెండు రోజుల్లో మొత్తం ఆపరేషన్ అయిపోతుందని అన్నాడు. ఆరు రోజులైనా కన్వీయర్ బెల్ట్ ఇప్పటికీ ఉపయోగంలోకి రాలేదు,టన్నెల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు టన్నెల్లోకి పోయినప్పుడు.. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశాం. మాకు అనుమతి లేదా బాధ్యతగల మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వొస్తే అడ్డుకుంటారా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే టన్నెల్ కూలిందని ఉత్తంకుమార్ రెడ్డి అనడం సిగ్గుచేటు. గత ప్రభుత్వానికి ఇప్పటి ఘటనలు ఏం సంబంధం. పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందా ఇస్తే అది బయట పెట్టండి. అని హరీష్ రావు డిమాండ్చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్ పిలిచి వాళ్ళ ఒపినియన్ తీసుకున్నారా. ఉంటే ఆ రిపోర్టు బయట పెట్టండి. చదువుకున్న వారు విజ్ఞానవంతులు మంత్రిగా ఉన్నారు రికార్డులు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎస్బీసీ లో 3300 కోట్ల రూపాయల పని జరిగితే 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 3900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాం. రెండేళ్లు వరుసగా కొరోనా వొచ్చినా, 10,000 లీటర్ల సీపేజి వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసాం. దిండి రిజర్వాయర్ ను, పెళ్లిపాక రిజర్వాయర్ ను ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వాటికి భూసేకరణ పూర్తి చేసి ఆ ప్రాజెక్టును 90% పూర్తి చేసాం. కానీ మైకుల ముందు నోటికి వొచ్చినట్టు గత ప్రభుత్వం పని చేయలేదని మాట్లాడారు. మంత్రి జూపల్లి 5 కిలోమీటర్లు మాత్రమే పనిచేసిన అన్నాడు. మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్నెల్ కు నాతో వొచ్చాడు. పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడత పెడుతున్నాడు.ఆరు రోజులు అంటే ఎంతో అమూల్యమైనవి. మంచినీళ్లు, లేకుండా ఆహారం అందకుండా ఆక్సిజన్ లేకుండా వారి ప్రాణాలు ఏం కావాలి. ఆ దారుణమైన పరిస్థితిలో ఉన్న వారి స్థానంలో ఉండి ప్రభుత్వం ఆలోచించాలి. రేవంత్ రెడ్డికి ఇక్కడికి వొచ్చి చూసే టైం లేదు. దిల్లీ, కరీంనగర్ వెళ్లి మాట్లాడుతున్నాడు.హెలికాప్టర్ వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు.
మరొక మంత్రి హెలికాప్టర్ లేదని హైదరాబాదులో ఉన్నాడు. హెలిక్యాప్టర్ దొరుకుతేనే ఇక్కడకు వొస్తా అనే పరిస్థితి మంత్రి ఉత్తమ్ ది.ముఖ్యమంత్రికి మంత్రికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? రేవంత్ రెడ్డి ఎందుకు ఇక్కడకు రావడం లేదు ఎందుకు డైరెక్షన్ ఇవ్వడం లేదు.ఎందుకు రేవంత్ రెడ్డి సమీక్షించడం లేదు, ఎందుకు ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం లేదు. ముఖ్యమైన ప్రాజెక్టు కుప్పకూలిపోతే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు. సుంకిశాల, పాలమూరు పథకంలోని వట్టెం పంప్ హౌస్ జలమయమైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది. ఉన్న నీళ్లను కూడా కాపాడలేని దుస్థితి మీది. శ్రీశైలం మొత్తం ఖాలీగా కనిపిస్తున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీరు దీనిపైన ఆధారపడి ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ ముళ్ళు కర్ర బట్టి పోలిస్తే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలడం లేదు. మొదటి కెఆర్ఎంబి మీటింగ్ లోనే ఒప్పుకొని వొచ్చారు. సెక్షన్ 3 కింద నీటి పంపకాలు అయ్యేవరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదు అని కేసిఆర్ గర్జించారు. మీరు నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటున్నామని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. చంద్రబాబు గోదావరి నీళ్లను బనకచర్ల లింకు ద్వారా ఆంధ్రకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టీ ప్రశ్నిస్తే, నిలదీస్తే అప్పుడు మూడి రోజుల కింద బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రాశారు.రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, కుర్చీల కొట్లాట మీ మధ్య ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఆరు రోజుల్లో చేసింది ఏం లేదు తట్టెడు మట్టి తేవడం తప్ప. ఇప్పటికైనా వేగంగా సహాయక చర్యలు చేపట్టాలి. అవసరం అయితే అదనపు బృందాలను తేవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. .