భద్రాద్రికి సరికొత్త శోభ

టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయ అభివృద్ధి
భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్
మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సీఎం అంగీకారం
భూసేకరణకు రూ.34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి  ఆలయం సరికొత్త  శోభ సంతరించుకోనుంది. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్ సర్కారు  కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య  అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూ సేకరణ సమస్యను  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కి దృష్టికి తీసుకు వెళ్లగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ.34 కోట్లు నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రామ నవమికి దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీకి అడుగులు పడనున్నాయి.

అడిగిన వెంటనే అంగీకారం..
ఆదివారం రోజున ఆలయ ఈవో, పండితులు ముఖ్య మంత్రిని కలిసి భద్రాచల సీతారామచంద్రస్వామి శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గతంలో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని తుమ్మల సీఎంకు వివరించారు. భూసేకరణ పనులు పూర్తి చేస్తే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని భద్రాద్రి ఆలయం భక్తులతో  మరింత శోభిల్లుతోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను మరుసటి రోజు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నవ భద్రాద్రి…
భారత దేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నవ భద్రాద్రి దిశగా తుమ్మల కృషి చేస్తున్నారు. భూ సేకరణ తరువాయి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా  భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు.

నమూనాలు సిద్ధం…
శ్రీరామచంద్రుడి ఆలయ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు, సూచనల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. శరవేగంగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన షాపులు, ఇల్లు మరో చోటకు మార్చేలా  ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి వేడుకలు అనంతరం నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనితో రాష్ట్ర ప్రజల కల సాకారం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *