- ఫామ్హౌజ్లో ఏమైనా చేశాడేమోనని అనుమానం
- ప్రజలు పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టాలని సూచన
- మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిది హావిూలు అమలు చేస్తే పదో హావిూ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పదవీ కాంక్షతో కేసీఆర్ని కేటీఆరే ఏదో చేశారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు.
భారాస ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయనే. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వొచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు. ఫామ్హౌస్లో ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్లో కేసీఆర్ కనిపించడంలేదని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో భాజపా, భారాస మధ్య చీకటి ఒప్పందం జరిగింది. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని.. భారాస నుంచి భాజపాకు క్రాస్ వోటింగ్ జరిగిందని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్కి పదవి కాంక్ష ఎక్కువ..
కేసీఆర్న్ని ఫామ్ హౌజ్ లోపల కేటీఆర్ గొంతు పిసికిండో ఎమోనన్న అనుమానం వొస్తుందని తీన్మార్ మల్లన్న అంటున్నారు. మరీ తీన్మార్ మల్లన్న అనుమానం వ్యక్తం చేసినట్లు ఫామ్హౌస్లో ఏం జరిగిందో ఏమో కానీ.. గత కొన్ని రోజులుగా కేసీఆర్ మాత్రం కనిపించడం లేదని మంత్రి సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. గజ్వేల్ నియోజవర్గం నుండి గెలిచిన వ్యక్తి సలహాలు ఇవ్వమంటే ఎక్కడున్నాడో తెలియదని.. మిమ్మల్ని గెలిపించిన గజ్వేల్ ప్రజలకు కష్టం వొస్తే ఎవరికి చెప్పుకోవాలని కేసీఆర్ని నిలదీశారు. మా ఎమ్మెల్యే కనబడటం లేదని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని కోరుతున్నానని గజ్వేల్ ప్రజలకు సూచించారు.





