- రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
- రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు..ఆందోళనలతో కమిషన్ అత్యవసర సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. నిందితుడు ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాశాడనే ప్రచారం సాగుతుంది. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీలో అతడికి 103 మార్కులు వొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ అంటూ సోషల్ వి•డియాలో ఒక ఫొటో మాత్రం వైరల్గా మారింది. కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం నిందితుల కాంటాక్ట్ లిస్ట్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. అయితే గ్రూప్ -1 పేపర్ లీక్ అయిన విషయంపై ఇంకా స్పష్టత లేదని నగర శాంతి భద్రతల అదనపు సీపీ విక్రమ్ సింగ్ అన్నారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద భద్రతను పర్యవేక్షించిన సీపీ..ఇప్పటి వరకు గ్రూప్-1 పేపర్ లీక్ అయినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. కేవలం తమకు ఉన్న సమాచారం ప్రకారం టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్ అయినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని..పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రవీణ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. కీలక నిందితుడు ప్రవీణ్ గ్రూప్- 1 ప్రిలిమ్స్ పేపర్ను లీక్చేశాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. లీకేజీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ నిర్వహించింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీపై కమిషన్ చర్చించింది. ఏఈ పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్ వన్ పరీక్షపై వొస్తున్న అనుమానాలను కమిషన్ పరిశీలిస్తుంది. ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు, అతడి పేపర్పై చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పరీక్షా పేపర్ లీకేజీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. కమిషన్ సమావేశం అనంతరం వి•డియా ప్రకటన విడుదలకు అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ సమావేశం తరువాత సీఎస్తో బోర్డ్ల సమావేశం జరుగనుంది. అయితే రాంగ్ బబ్లింగ్ కారణంగా ప్రవీణ్ డిస్క్వాలిఫై అయ్యాడని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా… ప్రిలిమినరీ కీ తో ఓఎమ్మార్ షీట్ చెక్ చేసినప్పుడు ప్రవీణ్కు 103 మార్కులు వొచ్చాయని ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ ఫోన్, ల్యాప్ టాప్ డాటా ఆధారంగానే లీకేజీలపై స్పష్టత వొచ్చే అవకాశం ఉంది. మరోవైపు లీకేజీకి కారకుడైన ప్రవీణ్పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటు వేసింది.
ప్రవీణ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో ఉద్యోగి రాజశేఖర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పేపర్ లీకేజీలో ఈ ఇద్దరు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం దమారం రేపుతున్న క్రమంలో టీఎస్పీ ఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారణ ప్రవీణ్ను అరెస్టు చేసి అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు, ప్రవీణ్ విచారిస్తే ఆయన వెనుక ఉన్న బీఆర్ఎస్ నేతలు బయటకు వొస్తారని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు.