ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే
సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ
వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ
న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. జిఎస్టీ వాతలపై ఇంతకాలం విపక్షాలు ప్రస్తావిస్తూ రాగా..తొలిసారిగా అధికార పక్షంలోనూ చర్చ మొదలయ్యింది. ఈ విషయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తొలిసారి పెదవి విప్పారు. ఇవేమి వాతలంటూ ఆర్థికమంత్రి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జిఎస్టిని తగ్గించాలని ఆ లేఖలో కోరారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పన్ను విధించడం అంటే.. ఒక వ్యక్తి కష్టం, అనారోగ్యం పై పన్ను విధించినట్లేనని తెలిపారు. అదే విధంగా వైద్య బీమా ప్రీమియం రంగంపై 18 శాతం జిఎస్టి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్నారు.
జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ చెల్లించడం సీనియర్ సిటిజన్లకు పెద్ద సవాలుతో కూడుకున్నదని తెలిపారు. ఈ అంశంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తనకు మెమోరాండం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు. కాగా… ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని పునపరిశీలించాలని నిర్మలా సీతారామన్కు గతంలో పలు మార్లు అభ్యర్థనలు వొచ్చాయి. వ్యక్తిగత ఆరోగ్య పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది జూన్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సామాజిక భద్రతకు కొలమానంగా ఈ పాలసీలను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించడంలో విూరు చేసే తగ్గింపు సహాయపడుతుందని నాన్`లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల సంఘం తెలిపింది. పెరిగిన పన్నుల రీత్యా గత 5 సంవత్సరాలలో ఆరోగ్య బీమా ప్రీమియం దాదాపు రెండిరతలు పెరిగిందని.. దీంతో పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నా మళ్లీ రెన్యువల్ చేసుకోవడం లేదని.. రెన్యువల్ చేసుకున్న వారు 65 నుంచి 75 శాతం వరకే ఉంటుందని పేర్కొంది. బీమా ప్రీమియంలను తరచుగా పెంచడం, ఎక్కువ జీఎస్టీ రేటు కారణంగా చాలా మంది పాలసీదారులు ప్రీమియం చెల్లించలేకపోతున్నారని సంఘం పేర్కొంది.