ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు•ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ టీవీ కెమెరాలు
40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత
ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్ అమలు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రేపు జరగబోయే వోట్ల లెక్కింపు పక్రియ కోసం జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత కొసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ వోట్లను తొలుత లెక్కిస్తారని, ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంల్లో వోట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. గురువారం జరిగిన పోలింగ్కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి వికాస్రాజ్ శుక్రవారం హైదరాబాద్లో డియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలతో పాటు భారీ భద్రత కల్పించినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, వోట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు చెప్పారు. 40 కంపెనీల కేంద్ర బలగాలు భద్రత విధుల్లో ఉన్నట్లు వివరించారు. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి టేబుల్పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2018లో 2,400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో రీపోలింగ్కు అవకాశం లేదని అన్నారు.
స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఇవిఎంలు
మూడంచెల భద్రత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణలో పోలింగ్ పక్రియ పూరైంది. వోటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. ఆ ఇవిఎలను సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. అక్కడ మూడంచెల భద్రత కల్పించారు. డిసెంబర్ 3న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ పక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. వోట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.