కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లే…

ఓడిపోయేటోడు, పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడు
మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్వదు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్‌ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
రాజేంద్రనగర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు

రాజేంద్రనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లేనని, ఓడిపోయేటోడు…పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీకి దమ్ముంటే బెంగళూరులో నిరుద్యోగులతో మీటింగ్‌ పెట్టగలడా…ఆ ధైర్యం ఉందా..వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు అని మోసం చేసి ఇక్కడ ఏం చేద్దామని వొచ్చావు…అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి అన్నావు..ఒక్కరికైనా ఇచ్చినవా.. ఇస్తే పేరు, ఫోన్‌ నెంబర్‌ చెప్పు నేను మాట్లాడతా..అంటూ హరీష్‌ రావు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత మణికొండ మారిందా..లేదా..అంటూ మంత్రి హరీష్‌ రావు ప్రజలను ప్రశ్నించారు.  గతంలో మంచినీళ్లకు ఇబ్బంది పడేవాళ్లమని, అపార్టుమెంటులో ఉండేవాళ్లు నీళ్ల ట్యాంకర్లకు డబ్బులిచ్చి తెచ్చుకునేటోళ్లని, కానీ రాష్ట్రం వొచ్చాక నల్లా బిల్లు మాఫీ చేసి ఉచితంగా నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్‌దని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ఆదివారం  రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మణికొండలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్‌ గౌడ్‌కి మద్ధతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉన్న మహారాష్ట్రలో 4 రోజులకు ఒకసారి నల్లా వొస్తుంది. మన దగ్గర కాంగ్రెస్‌ ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధుల ముందు ఖాళీ నీళ్ల బిందెలు పట్టుకొని వొచ్చి నిలదీసేవారు. జల మండలి దగ్గర ధర్నాలు చేసేవారు. కానీ కేసీఆర్‌ వొచ్చిన తర్వాత అసెంబ్లీలో విపక్ష నేతలు కూడా ఏ ఒక్క రోజు నీళ్ల సమస్య గురించి మాట్లాడలేదు. మారుమూల తండాలు, గూడేలలో గతంలో కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ బాధను తప్పించిన నాయకుడు కేసీఆర్‌. మహిళలు ఆలోచించాలి.

మంచినీళ్ల కష్టం తీర్చిన నాయకుడు కేసీఆర్‌ అని గుర్తు పెట్టుకోవాలి. నీళ్ల కోసం వెయిట్‌ చేసి పనికి ఆలస్యంగా వెళ్లిన రోజులు పోయాయి. హైదరాబాదులో కరెంట్‌ కష్టాలు ఉండేవి. ఏ దుకాణంలో చూసినా జనరేటర్లు ఉండేవి. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ఉండేవి. కానీ కేసీఆర్‌ అందరికి 24 గంటల కరెంట్‌ ఇచ్చిండు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక బెంగళూరులో కరెంట్‌ కోతలు పెరిగినయి. కర్ణాటక మోడల్‌ అని కాంగ్రెసోళ్లు ఊదరగొడుతున్నరు. అంటే తెలంగాణలో కరెంట్‌ కోతలు పెడతారా? మంచి నీళ్లు కట్‌ చేస్తారా? బెంగళూరులో రోడ్లు బాలేక ట్రాఫిక్‌ విపరీతంగా ఉంటుంది. హైదరాబాదులో ట్రాఫిక్‌ సమస్య తీరింది. అనేక ఫ్లై ఓవర్లు కట్టుకున్నాం. గ్రామాల్లో కరువు లేదు. హైదరాబాదులో కర్ఫ్యూ లేదు. సీసీ కెమెరాలు పెట్టి మంచి పోలీసింగ్‌తో శాంతిభద్రతలు కాపాడుకుంటున్నాం. కాంగ్రెస్‌ వొస్తే కరువు, కర్ఫ్యూ రెండూ వొస్తాయి. మూడు సార్లు గెలిచిన ప్రకాశ్‌ గౌడ్‌ సాదాసీదాగా ఉంటడు. అస్సలు గర్వం ఉండదు. ప్రజలకు ఏం కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి.  మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్వదు.  2018లో కూడా కాంగ్రెస్‌ గెలుస్తదని డప్పు కొట్టిర్రు కాంగ్రెసోళ్లు. గెలవకపోతే గడ్డం గీకనని ఉత్తం కుమార్‌ రెడ్డి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్‌ అన్నరు. ఓడిపోయినంక మాట మీద నిలబడకుండా పారిపోయిండ్రు. కన్న కొడుకు చూడకపోయినా నా పెద్ద కొడుకు కేసీఆర్‌ ఉన్నాడనే భరోసా ఇచ్చిండు కేసీఆర్‌. కేసీఆర్‌ మహిళా పక్షపాతి. నీళ్ల కష్టం తీర్చిండు. పెళ్లికి కల్యాణ లక్ష్మి ఇచ్చిండు. న్యూట్రిషన్‌ కిట్‌, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మి, గృహ లక్ష్మి ఇచ్చిండు. ఈ సారి గెలవంగనే మూడు కొత్త వరాలు వొస్తున్నాయి. సౌభాగ్య లక్ష్మి కింద 3 వేలు, గ్యాస్‌ సిలిండర్‌ 400 రూపాయలు, సన్న బియ్యం వంటి పథకాలు రాబోతున్నాయి.

ఈ పథకాలు కావాలంటే 30 వ తారీకు నాడు కారుకు గుద్దాలి. రిస్క్‌ వద్దు కారుకు గుద్దు. కాంగ్రెస్‌ వొస్తే స్కాములు చేయడానికి రెడీగా ఉన్నరు నాయకులు. కాంగ్రెస్‌ హయాంలో ఇసుక నుంచి ఆదాయం 5 కోట్లు మాత్రమే వొచ్చాయి. కానీ కేసీఆర్‌ వొచ్చిన తర్వాత ఆదాయం 5 వేల కోట్లకు చేరింది. ఆ డబ్బంతా అప్పుడు కాంగ్రెస్‌ నాయకుల జేబుల్లో పోయింది. కేసీఆర్‌ హయాంలో ఆ డబ్బు కల్యాణ లక్ష్మి రూపంలో సమాజానికి చేరింది. దిల్లీ కాలుష్యం తెలంగాణకు చేరింది. ఒక్క మూడు రోజులు భరిస్తే ఆ శబ్ద కాలుష్యం మళ్లీ దిల్లీకి పోతది. ఆ తర్వాత ఉండేది కేసీఆరే. నగరంలో బస్తీ దవాఖానాలు అద్భుతంగా పని చేస్తున్నాయి. బస్తీల్లో సుస్తీని బాగు చేసింది కేసీఆర్‌. ప్రకాశ్‌ అన్నని గెలిపిస్తే మూడు నెలల్లో మణికొండకు 100 పడకల హాస్పిటల్‌ మంజూరు చేస్తా. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌ చుట్టూ నాలుగు పెద్ద హాస్పిటళ్లు కడుతున్నాం. పదేళ్ల కాంగ్రెస్‌ మైనార్టీల కోసం 3 వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం 12 వేల కోట్లు ఖర్చు చేసింది.  కాంగ్రెస్‌ బీజేపీతో కొట్లాడలేదు. యూపీలో కాంగ్రెస్‌ 2 సీట్లు మాత్రమే గెలిచింది. పూర్తిగా విఫలమై సొంత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించింది.  కానీ కేసీఆర్‌ ఉన్నంతవరకు తెలంగాణ సెక్యులర్‌ గా ఉంటుంది. బీజేపీతో కొట్లాడే సామర్ధ్యం బీఆర్‌ఎస్‌ కే ఉంది.  కాంగ్రెస్‌ వస్తే రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలుతుంది. బెంగళూరులో గజానికి 80 రూపాయిలు లంచం ఇస్తేనే పర్మిషన్‌ వస్తుంది. ఆ పరిస్థితి హైదరాబాదుకు తెచ్చుకుందామా?  గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాదులో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో వందెకరాలు వస్తాయంటూ చంద్రబాబు కేసీఆర్‌ పాలనను మెచ్చుకున్నారు.  ఆటోలకు ఫిట్నెస్‌ ఛార్జీలు రద్దు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  మంచి చేసిన, మన బిడ్డ మన కేసీఆర్‌ ని గెలిపించుకోవాలి.  ప్రతిపక్షాలకు ఢల్లీిలో అధిష్టానం ఉంది. టిక్కెట్లు, నోట్లు అక్కడి నుంచి వస్తాయి. ప్రచారానికి నేతలు కూడా అక్కడి నుంచే వొస్తారు. కానీ కేసీఆర్‌ లోకల్‌ అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page