నిరుద్యోగులకు మరింత ఎదురుచూపు
వర్గీకరణ తీర్పు అమలు చేసే పనిలో ప్రభుత్వం
వర్గీకరణ తేలాకే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్
డీఎస్సీ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరింత ఎదురుచూపు తప్పేలా లేదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగగా ముందుకు వెళ్లాల్సి ఉండడంతో తో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ నుంచే వర్గీకరణ తీర్పు అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తితో దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే ఆలస్యమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. అయితే ముందుగా టెట్ నిర్వహించాలని చాలా మంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం చేసి ముందుగా టెట్ నిర్వహించారు. ఈ మధ్య ఆ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ వేసే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వొచ్చాయి. లేకుంటే వచ్చే డీఎస్సీ నాటికి తామంతా నష్టపోతామంటూ చాలామంది ఎస్సీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఓ ప్రత్యేక కమిషన్ను వేసింది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని రిట్కెర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నివేదిక వొచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులతో స్కూల్స్ ప్రారంభిం చాలని ప్రభుత్వం భావిస్తోంది. కాస్త ఆలస్యమైనా సరే అనుకున్నట్టుగానే పక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించింది. వీలైతే సభలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో పదే పదే డీఎస్సీ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే తాము ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వస్తుందని మంత్రి లోకేష్ పదే పదే చెబుతున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని అంటున్నారు. ముందు నుంచి అదే చెబుతున్నామని దానికి కట్టుబడి ఉన్నామని వివరిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సిపిఎస్ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పెన్షన్ ఇవ్వడం అన్నది హక్కు అన్నారు. దీనిని ఇప్పుడు ఏవేవో కారణాలు చూపి ఆపడం సరికాదన్నారు. గత జగన్ ప్రభుత్వం చెబుతున్న జిపిఎస్ను అంగీకరించ బోమని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఖాళీలను గుర్తించి అన్నీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పోలీసులు, డిగ్రీ, జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 60 నుండి 62 సంవత్సరాల కాల పరిమితి పెంపును ఎయిడెడ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గురుకుల ఉపాధ్యాయులు, గ్రంథాలయ శాఖ ఉద్యోగులు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులకూ వర్తింపజేయాలని కోరారు.
-కల్లూరి రామకృష్ణా రెడ్డి