రిజిస్ట్రేష‌న్ల కోసం నిరీక్ష‌ణ‌కు చెల్లు.. 

నాలుగేళ్లుగా  రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్నవారికి శుభవార్త
ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు
మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం
25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం 

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ క్రమబద్దీకరణ) పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు ప్రగతిపై బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ కు  అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలు, గత నాలుగు సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి ఎదురు చూస్తున్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షించి నిర్ణయించారు. ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని, వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పురపాలక పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్,  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి,  హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *