అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు
రోడ్లు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడిగితే మంత్రి కోమటి రెడ్డి లేదని సమాధానం ఇచ్చారని, కానీ ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్ లో 40శాతం ప్రభుత్వ నిధులతో, 60శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తామని ప్రస్తావించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదే విషయం మీద అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆర్ అండ్ బీ మంత్రి లేదని చెప్పడం చూస్తే ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదని తెలుస్తోందని అన్నారు. అసెంబ్లీ ఆయన మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం బాధ్యతగా సమాధానం ఇవ్వాలి. లేదండీ, ఉత్పన్న కాదు అనడం సరైంది కాదు. ఇది బాధ్యతా రాహిత్యమని అన్నారు. ప్రభుత్వం హ్యాం మోడల్ లో ప్రభుత్వం 40శాతం, ప్రైవేటు 60శాతం పెట్టుబడులతో అని బడ్జెట్లో చెప్పారు.
నిన్న మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ 60 శాతం గవర్నమెంటు అని చెప్పారు, భట్టి విక్రమార్క బడ్జెట్ బుక్కులో మాత్రం 60 శాతం ప్రైవేటు అని ఉంది. ఏది క్లారిటీ, భట్టిది కరెక్టా, మంత్రి వెంకట్ రెడ్డిది కరెక్టా? ఏది కరెక్టో క్లారిఫై చేయాలని డిమాండ్ చేశారు. హ్యాం మోడల్లో 28 వేల కోట్లతో రోడ్లను బాగు చేసే పథకంలో… ఈ రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసినపుడు, స్వపక్ణ, విపక్ష ఎమ్మెల్యేలు అని చూడకుండా అంతటా చేశాం.
అన్ని మండలాలకు రోడ్లు వేశామని హరీష్ రావు అన్నారు. 60శాతం ప్రైవేటు వాళ్లు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే, ఎన్ని సంవత్సరాల్లో, ఎంత వడ్డీతో చెల్లిస్తారు. ఈ ఆర్ధిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే, మరి ఇది ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలోకి వొస్తుందా? బడ్జెట్లో ప్రతి ఏటా బడ్జెట్ పెడతే మెయింటెనెన్సు కూడా మళ్లీ బడ్జెట్ అవసరముంటుంది. మీరు పదేండ్ల పాటు ప్రభుత్వంపై భారం వేయబోతున్నారా?. దీని మీద క్లారిటీ ఇవ్వాలని కోరారు.